గతేడాది జూన్లో అక్కినేని అఖిల్–జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఆ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయసు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు, తన భార్యకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అసలు సమస్యగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా.. లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా.. నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగెటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను.వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించాను. జైనాబ్ అదే విధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్ను దీవెనగా తీసుకున్నాం. కులం, మతం, వయసు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పాడు.
తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్ను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ్నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను. కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపింది. ఐదేళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ పేర్కొన్నాడు.
అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.


