
జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో ఆయనకంటూ గుర్తింపు పొందాడు. అయితే, ఈ చిత్రాల కంటే ముందుగా ఆయన నటించిన చిత్రం 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru). జూన్ 6న థియేటర్స్లోకి వచ్చేసింది. ఇందులో సంపద హీరోయిన్గా నటించగా చింతపల్లి రామారావు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలు. 2022లో ప్రారంభం అయిన ఈ మూవీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి సతీశ్ వేగేశ్న(Satish Vegesna) దర్శకత్వం వహించారు. గతంలో ఆయన 'శతమానం భవతి' వంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించారు. అయితే, తాజాగా విడుదలైన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే..
మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గోదావరి జిల్లా ఆత్రేయపురంలో ఈ కథ ప్రారంభం అవుతుంది. ఆ ఊరిలో సుబ్బరాజు (నరేశ్ వీకే), కృష్ణమూర్తి (రావు రమేశ్) మంచి స్నేహితులు. అయితే, పుట్టుకతోనే చలనం లేకుండా జన్మించిన జన్మించిన రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. చనిపోయాడు అనుకున్న కుమారుడిలో తిరిగి చలనం కనిపించడంతో సుబ్బరాజు (నరేశ్ వీకే) చాలా సంతోషిస్తాడు. అయితే, తన కుమారుడు పెరిగే కొద్ది సిగరెట్కు బానిస కావడం తండ్రిగా సహించలేడు. రాజాకు ఉన్న సిగరెట్ అలవాటుతో అతన్ని ఊరి వాళ్లు అందరూ ఆటపట్టిస్తూ ఉంటారు.
కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే రాజాకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకరినిఒకరు విడిచిపెట్టలేనంత ప్రేమలో ఉంటారు. కానీ, ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. జులాయిగా తిరుగుతున్న రాజాకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడం కృష్ణమూర్తికి ఇష్టం ఉండదు. కానీ, కూతురి కోసం పెళ్లికి ఓకే చెబుతాడు. అయితే, నిశ్చితార్థం నాడు రాజా చేసిన ఒక పొరపాటు వల్ల అక్కడ పెద్ద గొడవే జరుగుతుంది. దీంతో వారిద్దరి పెళ్లి ఆగిపోతుంది. ఆపై స్నేహితులుగా ఉన్న వారి తండ్రుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ క్రమంలోనే కృష్ణమూర్తికి సుబ్బరాజు ఒక ఛాలెంజ్ ఇసురుతాడు. త్వరలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల వరకు తన కుమారుడు సిగరెట్ ముట్టడని, ఈ సవాల్లో తాను గెలిస్తే నిత్యను రాజాకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరతాడు. అందుకు కృష్ణమూర్తి కూడా రెడీ అంటాడు. అయితే, ఫైనల్గా రాజా గెలుస్తాడా..? తను ప్రేమించిన నిత్యను పెళ్లి చేసుకుంటాడా..? ఛాలెంజ్ కోసం సిగరెట్ ఆపేస్తాడా..? నిశ్చతార్థంలో జరిగిన గొడవకు కారణం ఏంటి..? వంటి అంశాలు తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం నార్నే నితిన్, దర్శకుడు సతీశ్ వేగేశ్న అని చెప్పవచ్చు. నార్నే నితిన్ కెరీర్లో మొదటి చిత్రంగా విడుదల కావాల్సిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు తన నాలుగో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ హీరో టొవినో థామస్ నటించిన 'తీవండి' మూవీనే దర్శకుడు తెలుగులో రీమేక్ చేశారు. కథలో హీరో పుట్టగానే సిగరెట్ పొగ వల్ల ప్రాణాలు పోసుకున్నట్లు చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఆత్రేయపురం బ్యాక్డ్రాప్ అదిరిపోతుంది. కానీ, దానిని తెరపై చూపించడంలో దర్శకుడు అక్కడక్కడ కాస్త ఇబ్బందిపడ్డాడు అని చెప్పవచ్చు. ఈ కథలో హీరో పాత్ర చాలా బలంగా రాసుకున్న దర్శకుడు.. మిగిలిన పాత్రలపై అంతగా శ్రద్ద పెట్టలేదని తెలుస్తోంది.
అయితే, కేవలం హీరో పాత్రకే ఎక్కువ సమయం ఇవ్వడంతో కాస్త బోర్గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల ప్రేమ కథ కూడా చాలా రొటీన్గానే ఉంటుంది. ఈ కథ చాలా సినిమాలలో చూసిందే కూడా.. అయితే ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది. దీంతో సెకండాఫ్ అదిరిపోతుందని అందరూ అనుకుంటారు. కానీ, అంతగా మెప్పించలేదని చెప్పవచ్చు. ఇరు కుటుంబాలతో పాటు హీరో, హీరోయిన్ పడే సంఘర్షణ ఫర్వాలేదనిపించినప్పటికీ... ప్రతి సీన్ మనం ముందే అంచనా వేయవచ్చు. ప్రీక్లైమాక్స్లో ఫ్యామిలీ ట్రాక్లోకి కథ వెళ్తుంది. తండ్రి సవాల్ కోసం హీరో తీసుకున్న నిర్ణయం.. ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకూడదని కృష్ణమూర్తి పడే పాట్లు కొన్ని మెప్పిస్తాయి. ఫనల్గా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేని సినిమాగా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' మిగిలిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
నార్నే నితిన్కు ఇదే మొదటి సినిమా.. ఆపై కథలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అయినప్పటికీ రాజా పాత్రలో బాగానే మెప్పించాడు. గత మూడు సినిమాల్లో అతనిలోని కామెడీ యాంగిల్ చూసి ఉంటారు. ఇందులో యాక్షన్, ఎమోషనల్ సీన్స్ను సులువుగా పండించాడు. హీరోయిన్గా సంపద చాలా అందంగా కనిపిస్తుంది. తన పాత్రమేరకు పెద్దగా స్కోప్ లేకున్నా ఉన్నంతలో న్యాయం చేసింది. రావు రమేశ్, నరేశ్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరూ అదరగొట్టేశారు. కైలాస్ మేనన్ అందించిన సంగీతం అక్కడక్కడ సౌండ్ చేస్తుంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. కెమెరామెన్ పల్లెటూరి అందాల్ని తెరపై బాగానే చూపించారు. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.