
గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.
ఇండోర్లో ఈవెంట్..
మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు.
నా గుండె పగిలింది..
విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు.