
'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇదివరకే ప్రమాదాలు చోటుచేసుకోగా ఇప్పుడు మరో అపశృతి జరిగింది.
కన్నడ హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఇదివరకే వచ్చింది రెండో పార్ట్ కాగా.. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్. ఏ క్షణాన షూటింగ్ మొదలైందో గానీ ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఒకటి రెండు కాదు చాలానే ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.
(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)
తాజాగా జరిగిన సంఘటన గురించి చెప్పుకొంటే.. ఉడుపి జిల్లా కొల్లూరులో దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళకు చెందిన కపిల్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగాడు. లోతు ఎక్కువుండేసరికి నీట ముగిని చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది.

అంతకు ముందు కూడా 'కాంతార' టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిరోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓసారి పెద్ద గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. అలానే కొన్నిరోజుల క్రితం పంజుర్లీ దేవర హీరో,డైరెక్టర్ రిషభ్ శెట్టిని హెచ్చరించింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నీ చుట్టుపక్క వాళ్ల దగ్గరనుంచి నుంచే ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరుగుతుందా అని సందేహాలు వస్తున్నాయి.
(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)