
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgn) హిట్ సినిమాల్లో రైడ్ మూవీ ఒకటి. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా (Ileana D’Cruz) హీరోయిన్గా నటించింది. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్గా రైడ్ 2 రిలీజైంది.
నోరు విప్పిన బ్యూటీ
కానీ ఇందులో ఇలియానా స్థానంలో వాణీ కపూర్ తళుక్కుమని మెరిసింది. ఇలియానాను సెలక్ట్ చేయకపోవడంపై దర్శకుడు రాజ్ కుమార్ స్పందిస్తూ.. పెళ్లి తర్వాత ఆమె జీవితం మారిపోయిందని.. తను విదేశాలకు వెళ్లిపోవడం వల్లే కథానాయికను మార్చాల్సి వచ్చిందని వెల్లడించాడు. తాజాగా ఈ వ్యవహారం గురించి ఇలియానా పెదవి విప్పింది. రైడ్ 2లో నిన్ను మిస్ అయ్యాం. ఎప్పుడు కమ్బ్యాక్ ఇస్తావ్? అన్న అభిమాని ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రైడ్ సినిమాలో అజయ్ దేవ్గణ్, రాజ్ కుమార్ గుప్తాతో కలిసి పని చేయడం మర్చిపోలేను.
అందుకే చేయలేకపోయా..
ఈ మూవీ నాకెంతో స్పెషల్. దీని సీక్వెల్లో కూడా నటించమని ఆఫర్ వచ్చింది. కానీ నేనే చేయలేకపోయాను. ఆ అవకాశం వచ్చినప్పుడు నాకు కొడుకు పుట్టాడు. అప్పుడు వాడే నా మొదటి ప్రాధాన్యత. సినిమా టీమ్ ఇచ్చిన షెడ్యూల్ నాకు సెట్టవలేదు. అలా వదులుకోవాల్సి వచ్చింది. అయినా రైడ్ 2లో వాణి కపూర్ చాలా బాగా చేసింది. తన పాత్రకు మరింత అందాన్ని తీసుకొచ్చిందని ప్రోమోలు చూస్తేనే అర్థమైపోతుందని చెప్పుకొచ్చింది.
కచ్చితంగా మళ్లీ వస్తా!
వెండితెరపై ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నకు.. డైపర్లు మార్చే పనిలో బిజీగా ఉన్నానంటూ బాబు ఫోటోను షేర్ చేసింది. వెండితెరపై రీఎంట్రీ ఉంటుందా? అన్న ప్రశ్నకు తప్పకుండా మళ్లీ సినిమాలు చేస్తానని హామీ ఇచ్చింది. ఇలియానా.. ప్రియుడు మైఖేల్ డోలన్ను 2023లో పెళ్లి చేసుకుంది. వీరికి అదే ఏడాది బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇలియానా రెండోసారి గర్భం దాల్చింది.
చదవండి: శంకర్ కూతురు ఆ తెలుగు డైరెక్టర్ను అంతమాట అనేసిందేంటి!