
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదు అయింది. ఏప్రిల్ 26న జరిగిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో గిరిజనులను అవమానించలేలా మాట్లాడారంటూ విజయ్పై గిరిజన సంఘం నాయకుడు అశోఖ్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు వారు వివరించారు.
ఇంతకీ ఏం జరిగింది?
ఈ ఏడాది ఏప్రిల్ 26న హైదరాబాద్లో తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేడయంతో విజయ్పై కేసు నమోదు చేశారు.
అప్పుడే స్పందించిన విజయ్
ఈ వివాదంపై విజయ్ అప్పుడే స్పందించాడు. తాను ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని చెప్పారు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ అప్పుడే సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు.