సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటారు. కొందరు దీన్ని చూసిచూడనట్లు వదిలేస్తారు. మరికొందరు మాత్రం మనసులోకి తీసుకుని తెగ బాధపడిపోతుంటారు. ఇప్పుడు అలానే 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కన్నీళ్లు పెట్టుకుంది. బోనాల్లో పాల్గొన్నందుకు తనని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని చెబుతూ గుక్కపెట్టి ఏడ్చేసింది. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన బోనాల పండుగలో ఫరియా సందడి చేసింది. వేరే మతం అయినప్పటికీ హిందూ మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొంది. పోతురాజులతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ కూడా చేసింది. అయితే ఇదంతా చూసిన కొందరు ముస్లిం నెటిజన్లు.. ఫరియాని 'కాఫిర్' అని, మతానికి మచ్చ తెస్తోందని కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన ఫరియా ఇన్స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.
'నా తండ్రి ఇస్లాం మతాన్ని ఇష్టపడి ఇందులోకి మారారు. ఇస్లాం మతంలోని మంచి విషయాలన్నింటినీ నాకు చూపిస్తూ ఆయన నన్ను పెంచారు. నేను కూడా ఇస్లాంలో ఎప్పుడూ మంచినే చూశాను. మీరు కూడా మంచినే చూడాలని కోరుకుంటున్నాను బ్రో. నేను తప్పు చేస్తున్నానని, నేను కాఫిర్ అని అంటున్న ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను'
'నేను చెట్టు, రాయి, సీతాకోకచిలుక.. ఇలా ప్రతిదానిలోనూ జీవాన్ని చూస్తాను. అది మీకు అద్భుతంగా అనిపించకపోతే, దాని వల్ల దేవుడిపై మీ నమ్మకం పెరగకుండా దేవుడికి దూరమవుతున్నట్లయితే. మీరు దేవుడిని తప్పు మార్గంలో వెతుకుతున్నారని అర్థం. మీరు కలిసే ప్రతి మనిషిలో దేవుడిని చూడలేకపోతే కూడా మీరు తప్పు మార్గంలో ఉన్నట్టే. నేను ప్రేమ కోసం ప్రార్థిస్తాను. ఐక్యత కోసం ప్రార్థిస్తాను. శాంతి కోసం ప్రార్థిస్తాను. ఇకపైనా అలానే చేస్తాను. నాపై ద్వేషం చూపించే వారికి కూడా నేను మరింత ప్రేమని పంచుతాను. వారి మంచి కోసం ప్రార్థిస్తాను'
'నా మససు మంచిదని నాకు తెలుసు. నేను ప్రేమని అనుభవించాను. మంచితనాన్ని చూశాను. 'అల్లా' అనే పదానికి అర్థం నాకు తెలుసు. అది వెలుగు. ప్రతిచోటా, ప్రతి సమయంలో అన్నింటినీ ఏకం చేసే వెలుగు. ఇంత విశాలమైన దాన్ని మీరు ఎలా సంకుచితం చేయగలరు?' అని ఫరియా ప్రశ్నించింది. ఈమె నటించిన 'సిగ్మా' మూవీ త్వరలో రిలీజ్ కానుంది.


