
‘‘సాహిత్యం, కవిత్వం, భాష విలువలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోతున్నాయి. భాషని బతికించే శక్తి సినిమాకే ఉంది. మా ‘8 వసంతాలు’ చూసిన తర్వాత ఎవరో ఒకరు ఆ భాషపై ఇష్టాన్ని పెంచుకోవచ్చు. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ నాకు సందేశాలు పంపుతుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతికా సనీల్కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’.
హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ– ‘‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ కోసం స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టింది.
బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా నా కథలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన గౌరవాన్ని కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణమే ‘8 వసంతాలు’. నేను రాసుకున్న శుద్ధీ అయోధ్య పాత్రకు అనంతిక కరెక్టుగా సరిపోయారు. నటిగానే కాదు... తనకి మార్షల్ ఆర్ట్స్తో పాటు దాదాపు 13 కళల్లో ప్రవేశం ఉంది. పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఫిల్మ్గా ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్లో ‘8 వసంతాలు’ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత ఎలాంటి కథలు చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని చెప్పారు.