
తొలి సినిమాతో హిట్టందుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. కానీ ఈ బ్యూటీ ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. తనే కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి (Sridevi Appala). ఈ కాకినాడ పిల్ల సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయింది. ఆ పాపులారిటీతోనే కోర్ట్ సినిమా నుంచి పిలుపొచ్చింది. ఆడిషన్లో సెలక్ట్ అవడంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది.
ఆ గుడికి వెళ్లాకే..
అయితే కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాకే తనకు కోర్ట్ సినిమా వచ్చిందంటోంది శ్రీదేవి. తాజాగా వాడపల్లి దేవాలయాన్ని సందర్శించి మొక్కులు కూడా సమర్పించుకుంది. ఆమె మాట్లాడుతూ.. మంచి సినిమా ఛాన్స్ రావాలని వాడపల్లి దేవుడిని కోరుకున్నాను. ఇందుకోసం ఏడువారాలపాటు ఆలయానికి వస్తానని మొక్కుకున్నాను.
ఈ గుడిలో అనుకున్నవన్నీ జరిగాయి
రెండోవారానికే నాకు కోర్ట్ సినిమా (Court- State Vs a Nobody) ఆఫర్ వచ్చింది. సినిమా కూడా చాలా పెద్ద హిట్టయింది. ఇప్పుడు ఏడువారాలు పూర్తయ్యాయి. ఒక పూజ చేయించుకునేందుకు ఆలయానికి వచ్చాను. ఇక్కడ ఏం అనుకున్నా నెరవేరుతుంది. నాకు చాలా మంచి జరిగింది. నేను కోరుకున్నవన్నీ జరిగాయి అని శ్రీదేవి చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ గుడి ఎక్కడుందంటే.. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఉంది.
కోర్ట్ సినిమా విశేషాలు
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం కోర్ట్. ప్రియదర్శి, శివాజీ, రోహిణి, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీతో రామ్ జగదీశ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నాని సమర్పణలో అతడి అక్క ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. విజయ్ బుల్గనిన్ సంగీతం అందించాడు. మార్చి 14న విడుదలైన ఈ మూవీ రూ.66 కోట్లు వసూలు చేసింది.
చదవండి: సైన్యంలోనే కాదు ఇక్కడా హీరోనే.. అక్కపై హీరోయిన్ ప్రశంసలు