ఫ తహసీల్దార్ అసాధారణ నిర్ణయం
ఫ రెవెన్యూ వర్గాల్లో సర్వత్రా విస్మయం
రామచంద్రపురం రూరల్: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న పంపన రామారావును ఆర్డీఓ కార్యాలయానికి సరెండర్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ బండి మృత్యుంజయరావు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై రెవెన్యూ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీసీఏ రూల్స్–1991, కాండక్ట్ రూల్స్–1964 ప్రకారం విధి నిర్వహణలో తప్పు చేస్తే సబార్డినేట్ సర్వీస్ రూల్–9 ప్రకారం ఆ ఉద్యోగిపై విచారణ చేపట్టాలి. ఆపై అభియోగాలు మోపి, ప్రాథమిక, తుది విచారణలు నిర్వహించిన తరువాత ఆ ఉద్యోగిని నియమించిన అధీకృత అధికారికి నివేదిక సమర్పించాలి. ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకునే అధికారం వారికి మాత్రమే ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లను, వీఆర్ఓలను జిల్లా కలెక్టర్ నియమిస్తారు. ఆ మేరకు కలెక్టర్కు నివేదిక అందజేయాలి. కానీ, ఇక్కడ సీనియర్ అసిస్టెంట్ రామారావును ఆర్డీఓ కార్యాలయానికి తహసీల్దార్ సరెండర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పైగా సర్వీసు రూల్స్లో లేని సరెండర్ విధానాన్ని ఎవ్వరూ అమలు చేయకూడదని హైకోర్టు గతంలో అనేకసార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఒక సీనియర్ ఉద్యోగిపై నిబంధనలకు విరుద్ధంగా ఈ చర్య తీసుకున్నారంటూ రెవెన్యూ ఉద్యోగులు మండిపడుతున్నారు.


