బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నేతన్నల సేవ పథకం అమలులో జిల్లా చేనేత శాఖ అధికారుల అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమాఖ్య కన్వీనర్ పంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలకు చెందిన చేనేత కళాకారులు పాల్గొన్నారు. కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పథకం అమలులో లబ్ధిదారుల ఎంపిక, గుర్తింపు విషయంలో అక్రమాలు జరిగినట్లు చేనేత కళాకారులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. వీటిపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తప్పిదాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయితే సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత కార్మికులను బెదిరించి , ఇతర మార్గాల్లో వసూలు చేసిన మొత్తాలను తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.


