దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.
టైంపాస్ చేస్తున్న దీప్తి
ఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.
ఏం చేశానని ఇంత ప్రేమ?
'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.
ఆ ప్రయత్నంలోనే ఉన్నా..
నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.

చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల


