
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన 'అఖండ' సూపర్ హిట్. 2021 డిసెంబరులో రిలీజైన ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీస్తున్నారు. షూటింగ్ చాలావరకు పూర్తి చేశారు. జూన్ 10న అంటే రేపటి రోజున బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. తొలి భాగానికి ఏ మాత్రం తగ్గకుండా ఈసారి కూడా సినిమాని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.
తొలి భాగంతో పోలిస్తే ఈసారి బాలకృష్ణ లుక్లో చిన్నపాటి మార్పులు చేశారు. పొడవాటి జుత్తుతో పాటు పొడుగు గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు. 'నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా?' అంటూ విలన్కి వార్నింగ్ ఇచ్చే ఓ డైలాగ్ కూడా ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)
మంచు కొండల్లో బాలయ్య నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కాస్త కృత్రిమంగా అనిపించాయి. అలానే విలన్ ఎవరనేది రివీల్ చేయలేదు. ఎప్పటిలానే తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్తో ఆకట్టుకున్నాడు. సెప్టెంబరు 25న సినిమాని థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి అది తేదీకి పవన్ 'ఓజీ' కూడా రిలీజ్ కానుంది. ఇద్దరూ వస్తారా? లేదంటే ఎవరైనా తప్పుకొంటారా అనేది చూడాలి?
ఈ సినిమాకు బోయపాటి దర్శకుడు కాగా.. 14 రీల్స్ సంస్థతో పాటు బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది. 'అఖండ' నుంచి సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన బాలయ్య.. తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో వరస హిట్స్ అందుకున్నారు. తాజాగా రిలీజైన 'అఖండ 2' టీజర్ చూస్తుంటే మరోసారి ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమనిపిస్తోంది.
(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే?)