
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు.
శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.