మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్ | Actress Nandini Rai Climbs Tirumala Steps On Knees | Sakshi
Sakshi News home page

మరోసారి మోకాళ్లపై తిరుమల శ్రీనివాసుని చెంతకు వెళ్లిన తెలుగు హీరోయిన్

Jan 12 2025 9:55 AM | Updated on Jan 12 2025 10:18 AM

Actress Nandini Rai Climbs Tirumala Steps On Knees

సినిమాల కోసం మాత్రమే గ్లామర్‌ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai)  సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.

( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)
టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన  నందినీ రాయి.. బిగ్‌ బాస్‌ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్‌ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో  విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్‌ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా  శ్రీవారిని నందిని రాయ్‌ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు.   మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్‌ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..
దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్‌ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్‌ హైదరాబాద్‌ కిరీటం దక్కించుకున్నారు.  2010లో మిస్‌ ఆంధ్రప్రదేశ్‌ విన్నర్‌ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్‌, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.

అప్పుడు సూసైడ్‌ చేసుకోవాలనుకున్న నందిని
గతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్‌ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్‌ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్‌ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్‌ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్‌ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement