తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి పరుత్తివీరన్(తెలుగు మల్లిగాడు) సినిమా ఫేమ్, ప్రముఖ నటుడు శరవణన్ కారణమని.. ఆయన మొదటి భార్య సూర్యశ్రీ చెన్నై మౌళివాక్కం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. 1990లో తమిళ ఇండస్ట్రీలో హీరోగా చేసి, తర్వాత పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించిన శరవణన్.. 2003లో సూర్యశ్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2019లో శ్రీదేవి అనే మరో మహిళని పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మంగాడు సమీపంలోని ఒకే అపార్ట్మెంట్లోని ఎదురెదురు ఇళ్లలో మొదటి, రెండో భార్యతో కలిసి శరవణన్ నివసిస్తున్నాడు.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న సీరియల్ హీరోహీరోయిన్)
సీసీటీవీ కెమెరాల తొలగింపుతో తనకు ప్రాణహాని ముప్పు ఏర్పడిందనే భయాందోళన వ్యక్తం చేస్తూ సూర్యశ్రీ తన లాయర్లతో కలిసి మౌళివాక్కం పోలీస్ స్టేషన్లో భర్తపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నారని, ఇప్పటికే తనపై పలుమార్లు దాడులు చేశారని ఇందులో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు తీసేసి తన ప్రాణానికి భయం కల్పించారని.. తనకు, తన ఆస్తికి ఏ హాని జరిగినా దానికి శరవణన్ పూర్తి బాధ్యుడని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై మౌళివాక్కం పోలీసులు ఇరు పక్షాలని పిలిపించి విచారణ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: సమంత 'మా ఇంటి బంగారం' రివ్యూ)


