పహల్గామ్‌ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా! | Actor Prakash Raj Responds On Phalagam Incident | Sakshi
Sakshi News home page

Prakash Raj: పహల్గామ్‌ ఘటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తీవ్రమైన బాధతో రాస్తున్నా!

Apr 24 2025 8:01 PM | Updated on Apr 24 2025 8:11 PM

Actor Prakash Raj Responds On Phalagam Incident

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిపై సినీనటుడు ప్రకాశ్ రాజ్‌ స్పందించారు. పర్యాటకులపై జరిగిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తలచుకుంటే తనకు మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. కశ్మీర్‌పై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఇలాంటి అత్యంత క్రూరమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌ రాజ్‌ రెండు పేజీల సందేశాన్ని ట్వీట్‌ చేశారు.

ప్రకాశ్ రాజ్‌ తన ట్వీట్‌లో రాస్తూ.. 'ఏప్రిల్‌ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు. ప్రశాంతమైన ప్రకృతి ప్రాంతమైన పహల్గామ్‌లో నెత్తురు చిందిన రోజు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. ఈ దారుణమైన చర్యను చెప్పడానికి నకాు మాటలు కూడా రావడం లేదు. అందుకే బాధతో కూడిన హృదయంతోనే రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంంగా కాల్చి చంపారు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితికి గురయ్యారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు.. ప్రతి కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన దారుణచర్య. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది' అని రాసుకొచ్చారు.

ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన ప్రతిసారీ మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు చేయని పనికి అవమానాలు పడాల్సి వస్తోంది. ఈ విషయంలో అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య.. అంతకుమించి పిరికిపంద చర్య. ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మన ఇంటిలో జరిగిన ఈ కృరమైన  చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన లేదు. ఉగ్రవాదులు ఏం ఆశించి ఇంత దారుణానికి ఒడిగట్టారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసిందని.. ఎంతోమంది పిల్లలను అనాథలుగా మార్చిందని ప్రకాశ్ రాజ్‌ అవేదన వ్యక్తం చేశారు.


కశ్మీర్‌ ఆట స్థలం కాదు.. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు. మీరు ఉపయోగించుకునే ఆయుధం కాదు.. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశమే కశ్మీర్ అని తెలిపారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో పాటు మీరు కోల్పోయిన దానికి మేము చింతిస్తున్నామని ప్రకాశ్ రాజ్‌ రాసుకొచ్చారు. మీరు కశ్మీర్‌లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు.. కానీ మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు క్షమించమని అడుగుతున్నామని ప్రకాశ్‌రాజ్‌ పోస్ట్‌ చేశారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement