పటాన్చెరు: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్కు ఒక న్యాయం.. సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం, రెవెన్యూ మంత్రి ఆస్తులను ఒక్కరోజులో 22ఏ జాబితా నుంచి తొలగించినట్లే సామాన్యుల ఆస్తులను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు పట్టణంలోని సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీలో శనివారం 22 ఏ బాధితులతో ఆయన సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ..55 ఎకరాల్లో 953 ఇళ్లతో నిర్మించిన సింఫోనీ పార్క్ హోమ్స్ కాలనీని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హెచ్ఎండీఏ నుంచి లే అవుట్ అనుమతులు, జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు తీసుకున్న తర్వాతే ఇళ్ల నిర్మాణం జరిగిందని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అనుమతులను నమ్మి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్లను కొనుగోలు చేసి 12 ఏళ్లుగా నివసిస్తున్నారని చెప్పారు. 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని అనుమతులిచ్చిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం తిరిగి ఆ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం అన్యాయమన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని తమ సమస్యపై ఉద్యమించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, దిశ కమిటీ సభ్యుడు కాసాల సుధాకర్, కాలనీ అధ్యక్షుడు విజయ్రాజ్, ప్రధాన కార్యదర్శి సత్యారావు, పటానన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు, 22ఏ బాధితులు తదితరులు పాల్గొన్నారు.
సీఎంకొక న్యాయం.. సామాన్యులకొక న్యాయమా?
బాధితులను కలిసిన ఎంపీ రఘునందన్రావు


