మెదక్ కలెక్టరేట్: సమాజానికి ఉపాధ్యాయుడు దిక్సూచి అని, పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉపాధ్యాయులు గురుతర భాధ్యతను నిర్వహిస్తున్నారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి సందర్భంగా శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ...పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. గురువులు సమాజానికి దిక్సూచి వంటి వారని తెలిపారు. కాలానుగుణంగా విద్యా బోధనలో మార్పులు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. పది, ఇంటర్ ఉత్తమ ఫలితాలతో మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 52 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రాధిక, డీఈఓ రాజు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో ఘనంగా గురుపూజోత్సవం
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్


