● అధికారుల పర్యవేక్షణ లోపం
● కలుషితమవుతున్న చెరువులు, కుంటలు
హత్నూర(సంగారెడ్డి): ప్రతిరోజు గ్రామాల్లో సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రభుత్వం సెగ్రిగేషన్ షెడ్డు ఏర్పాటు చేసింది. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో అది నిరుపయోగంగా మారింది. దీంతో సేకరించిన చెత్తను గ్రామ శివారులోని చెరువుల్లో వేస్తున్నారు. మండలంలోని ఎల్లమ్మ గూడ పంచాయతీలో గత ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మించింది. ఎరువులు తయారు చేయాలన్న లక్ష్యంతో అది ఏర్పాటు చేసినప్పటికీ లక్ష్యం నీరుగారి పోతోంది. మండలంలోని పలు గ్రామాల్లో రోజూ సేకరించిన చెత్తను చెరువు, కుంటలో వేయడంతో అవి కలుషితమయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను చెరువు, కుంటలో కాకుండా ఇతర ప్రాంతంలో వేయించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
స్థానికంగా ఉండని కార్యదర్శులు
ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకునే గ్రామ కార్యదర్శులు స్థానికంగా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మండలంలో 38 పంచాయతీలు ఉండగా, సుమారు 35 మంది కార్యదర్శులు పట్టణాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. సర్టిఫికెట్లపై సంతకాలు చేయించేందుకు పంచాయతీకి వెళితే అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి విధులకు చుట్టపు చూపుగా వస్తూ వెళ్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇ ప్పటికై నా పంచాయతీ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


