మల్దకల్: వ్యవసాయ పొ లం వద్ద నిద్రిస్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియ ని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన మల్దకల్ మండలం ఉలిగేపల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఉలిగేపల్లికి చెందిన బోయ గోవిందు – పద్మమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడైన మహేశ్ (22) రోజులాగే బుధవారం రాత్రి తమ వ్యవసాయ పొలంలో నిద్రించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలి యని వ్యక్తులు దాడిచేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్ఐ శ్రీహరి ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసు జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. కాగా, మహేశ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
చెక్డ్యాంలో
దిగి వ్యక్తి గల్లంతు
కోస్గి రూరల్: చెక్డ్యాంలో బోరు మరమ్మతుకు వెళ్లిన వ్యక్తి గల్లంతైన ఘటన మండల పరిధిలోని లోదిపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిన్న శ్యామలప్ప మరో నలుగురితో కలిసి తన చిన్నాన్న తిరుమలయ్యకు చెందిన బోరు మోటార్ మరమ్మతు నిమిత్తం చంద్రవంచ– లోదిపూర్ గ్రామాల మధ్యలో ఉన్నా చెక్డ్యాం నీటిలోకి దిగాడు. ఈ క్రమంలో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోని గాలింపు చర్యలు చేపట్టారు. అదే విధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని రెస్క్యూ టీం చెక్డ్యాంలో రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
గొర్రె పొట్టేళ్లు మృతి
వనపర్తి రూరల్: ప్రమాదవశాత్తు విద్యుత్షాక్తో 13 గొర్రె పొటేళ్లు మృతి చెందిన ఘటన శ్రీ రంగాపురం మండలంలో గురువారం చోటు చేసుకున్నది. స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని నాగసానిపల్లికి చెందిన గొల్ల శివయ్యయాదవ్ గురువారం ఉదయం గొర్రెలను మేపి సాయంత్రం ఇంటిదగ్గర షెడ్డులో ఉంచాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో 13 గొర్రె పొటేళ్లు మృతి చెందాయని తెలిపారు. దాదాపు రూ.3.25 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితుడు అధికారులను కోరారు.


