అడ్డాకుల: వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ మూసాపేట మండల కేంద్రంలో గ్రామస్తులు శివాంజనేయ స్వామి ఆలయంలో శనివారం జలదిగ్బంధం కార్యక్రమం నిర్వహించారు. హిందూ సంప్రదాయంలో శివుడిని అభిషేక ప్రియుడిగా భావించే క్రమంలో గ్రామస్తులు ప్రధాన ఆలయంలోని గర్భగుడిలోని శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. బీచుపల్లి ఆలయం వద్ద కృష్ణా జలాలను తీసుకొచ్చి, వాటిని కలిపిన నీళ్లను గ్రామస్తులు శివలింగం పూర్తిగా మునిగే వరకు నీళ్లుపోసి వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. తర్వాత ఆలయం వద్ద మధ్యాహ్నం వేళ అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


