●
దుండగులను
కఠినంగా శిక్షించాలి
మా గ్రామంలో కొంతకాలంగా గుప్తనిధుల తవ్వకాలను జరుపుతున్నారు. మేనెలలో కృష్ణానదిలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మళ్లీ వాటిని తవ్వడానికి దుండగులు ప్రయత్నించారు. పోలీస్ అధికారులు దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– దేవేంద్రప్ప, మాజీ సర్పంచ్, గుర్జాల్
సహకరించిన వారిని కూడా..
దుండగులకు సహకరించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవాలి. నదిలోని విగ్రహాలను తవ్వడానికి ఈ ప్రాంతంలోని వ్యక్తుల సహకారం లేనిదే వేరే గ్రామాల వాళ్లు ఎలా వస్తారు. దుండగులతోపాటు వారికి సహకరించిన వ్యక్తులపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. – శివరాజ్గౌడ్, గుర్జాల్
జిల్లా అధికారులకుఫిర్యాదు చేస్తాం
మా గ్రామంలో చాలారోజుల నుంచి గుప్తనిధుల వేట కొనసాగుతున్నది. చారిత్రాత్మకమైన విగ్రహాలను ధ్వంసం చేస్తుండడం చాల బాధగా ఉంది. మేము ఈ విషయంపై జిల్లా అధికారులను కలిసి దుండగులను శిక్షించాలని కోరుతాం. – కీరప్పపాటీల్, గుర్జాల్
కృష్ణా: కృష్ణా మండలం ఉమ్మడి జిల్లాలోనే ఓ ఆధ్యాత్మిక ప్రాంతం.. ఇక్కడున్న జీవనదులు, ఆలయాలు, ఇలా ప్రతి అంశంలో కూడా పేరుప్రఖ్యాతలు. ఏమైందో ఏమో కొంతకాలంగా ఈ ప్రాంతంలో అక్రమాలు, దోపిడీలు, సమాజ హితం కాని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికి కారణం అధికారుల అలసత్వమని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రైల్వేపట్టాల పక్కన 10రోజుల పసికందును వదిలి వెళ్లిన ఘటన మరవక ముందే.. మళ్లీ గుప్తనిధుల తవ్వకాలు, మరోపక్క చోరీలు, పేకాట, అక్రమరవాణా, ఇలా చెప్పుకుంటుపోతే చాలానే ఉన్నాయి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని మండల ప్రజలు కోరుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సరిగ్గా 12గంటల సమయంలో కొందరు దుండగులు కృష్ణానదిలో ఆంజనేయ విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయని జేసీబీతో తవ్వకాలు మొదలు పెట్టారు. ఇది మొదటిసారి కాదు.. ఇక్కడ ఇదే విగ్రహాన్ని తవ్వడం మూడోసారి. మేనెలలో నదిలోని శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలను తవ్వి దాని కిందున్న నిధులను దోచుకున్నారని, ఆ తర్వాత తాము అష్టకష్టాలు పడి ఆ విగ్రహాలను పునర్ప్రతిష్టపన చేశామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ విగ్రహాలను తవ్వేందుకు రాత్రి ప్రయత్నిస్తుండుగా.. గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం జేసీబీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కేవలం కాల్వ తవ్వకాలు ఉన్నాయని జేసీబీ తీసుకరమ్మంటే వచ్చానని, తీరా అక్కడికి వచ్చాక గుప్తనిధుల తవ్వకాలు ప్రారంభించారని డ్రైవర్ గ్రామస్తులకు తెలిపాడు. ఈ గుప్తనిధుల తవ్వకాల్లో ఓ శాఖ అధికారుల ప్రమేయం ఉందని, గతంలోనూ మండలంలోని కున్సీ, హిందుపూర్, ముడుమాల్లో కూడా ఇదేవిధంగా తవ్వకాలు జరిపారన్నారు. వాటిపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని ఆరోపించారు. వీటి వెనుక వవరో బలమైన వ్యక్తులు, వ్యవస్థ ఉండడం వల్లే ఇంతపెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నారని, లేకపోతే ఇంత ధైర్యంగా దుండగులు ప్రయత్నించరని గ్రామప్రజలు బహిరంగంగా వాఖ్యనిస్తున్నారు. దీనివెనుక ఎంతటివారు ఉన్న వారిని వదలమని, మేము వారిని పట్టుకునే వరకు పోరాడుతామంటున్నారు. ఈ విషయంపై ఎస్పీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏదీ ఏమైన ఈ గుప్తనిధుల తవ్వకాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని కోరారు. ఈ విషయంపై ఎస్ఐ నవీద్ను వివరణ కోరగా ఈ ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
గుర్జాల్ గ్రామస్తులు వెంటపడటంతో పరారైన దుండగులు
జేసీబీ, డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగింత
గతంలో ఇదే మాదిరిగా తవ్విన దుండగులు
కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్


