మచిలీపట్నంఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్బాబు డిమాండ్ చేశారు. మచిలీపట్నం రూరల్ మండలంలోని ఓ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పీఆర్సీ గడువు ముగిసి మూడు సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు కొత్త పీఆర్సీ కమిటీని నియమించకపోవడం, ఐఆర్ ప్రకటించకపోవడం ఆందోళనకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు రెండున్నరేళ్ల క్రితమే ఐఆర్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఏపీలో మాత్రం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ చైర్మన్ మన్మోహన్సింగ్ కమిటీలో చేరకుండానే రాజీనామా చేసినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త కమిటీని నియమించకపోవడం ఉద్యోగులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. వెంటనే కాలపరిమితి (టైమ్ బౌండ్)తో కూడిన పీఆర్సీ కమిటీని నియమించి, ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగులకు సరెండర్ లీవ్ నగదును పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేవలం 2022 సంవత్సరానికి మాత్రమే సరెండర్ లీవ్ నగదు చెల్లిస్తామనడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న సరెండర్ లీవ్ మొత్తాన్ని వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు.వి.కృష్ణమూర్తి, మచిలీపట్నం రూరల్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై. సుబ్రహ్మణ్యేశ్వరరావు, జె.రాజు పాల్గొన్నారు.
ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి జోసఫ్ సుధీర్బాబు


