మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి కొడాలి గ్రామానికి చెందిన ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సోదరి తుమ్మల లక్ష్మీసుజాత బంగారు నాగపడగ సమర్పించారు. రూ.30 లక్షలు వెచ్చించి 220 గ్రాముల బంగారంతో నాగపడగ చేయించారు. శనివారం ఉదయం స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం దాత లక్ష్మీసుజాత కుమారులు శ్రీనివాస కిరణ్, శివతరుణ్ పేరిట బంగారు నాగపడగను ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఎంపీపీ రావి దుర్గావాణి, మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరావు పాల్గొన్నారు.
ప్రజాధనాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టొద్దు
కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న ప్రతి రూపాయి వారి సొత్తేనని, దానిని ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్వస్తి చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక ఘోష్ బోస్ డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభ జరిగింది. ముఖ్య అతిథి కనినిక ఘోష్ బోస్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న సొమ్మును కార్పొరేట్లకు దోచిపెట్టే హక్కు ప్రభుత్వాలకు లేదని, ఇది మోదీ, అమిత్షా సొమ్ము కాదని స్పష్టం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు చుక్కలనంటి సామానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న అసమానతలు, వివక్ష, హింసకు వ్యతిరేకంగా ఐద్వా పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, సీనియర్ నాయకులు ఎస్.పుణ్యవతి, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో రూ.600 కోట్లతో యూజీడీ పనులు
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో రూ.600 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచి, వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు చేపడుతున్నామని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ తెలిపారు. నిర్మలా కాన్వెంట్ సిగ్నల్స్ వద్ద జరుగుతున్న ఔట్ఫాల్ డ్రెయిన్ పూడికతీత పనులను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం పలు డ్రెయిన్లలో పూడిక పేరుకు పోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు శనివారం నుంచి 70 యంత్రాలతో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టామని వివరించారు. ఈ పర్యటనలో ఇంజినీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్, ఇన్చార్జి కమిషనర్ ఎ.రవీంద్రరావు, వీఎంసీ చీఫ్ ఇంజినీర్ పి.సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గ్లోరీ, జోనల్ కమిషనర్ కె.షమ్మీ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పాల్గొన్నారు.
పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలోని ఆయా ప్రాంతాల్లో వీఎంసీ కల్పించే మౌలిక వసతుల కల్పనలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమ వారం వినాయక చవితి పర్వదినం సంద ర్భంగా రద్దు చేసినట్లు వీఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నగరవాసులు తర్వాత వచ్చే సోమవారం తమ వినతులను అధికారులకు సమర్పించి పరిష్కరించుకోవచ్చని సూచించారు.


