ఆర్మీ కల్నల్ డి.అగ్నిహోత్రి
ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి
గుడివాడ టౌన్: రాష్ట్రంలో వర్షాభావం కారణంగా పత్తిరైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఏపీ వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పత్తి వర్షాధారిత పంట కావడంతో వర్షాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సాగునీటి సౌకర్యంగానీ, విత్తన సబ్సిడీగానీ లేకపోవడంతో రైతు కష్టాలకు ఓర్చి సాగు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, ఎన్టీఆర్, మార్కాపురం తదితర జిల్లాల్లో వేలాది మంది రైతులు వర్షంపై ఆధారపడి ఈ సాగు చేస్తారని పేర్కొన్నారు. వరి తర్వాత అత్యధికంగా సాగు చేసేది పత్తి పంటేనన్నారు. జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు 50 శాతం సాధారణ వర్షపాతానికి తక్కువగా వర్షాలు కురిశాయని పేర్కొన్నారు. వర్షాభావంతో పంట దిగుబడి తగ్గే రైతులకు ప్రత్యేక కరువు సహాయం ప్యాకేజి ప్రకటించాలని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ అందించాలని, తీవ్రంగా దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం అందించాలని, కనీస మద్దతు ధర అందేలా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సమర్థంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేతనకొండ(ఇబ్రహీంపట్నం): లారీ ఢీకొనడంతో వృద్ధురాలు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కేతనకొండలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అంకసాల అక్కమ్మ(90) హుషారుగా తన పనులు తాను చేసుకుంటుంది. ప్రతిరోజూ మాదిరిగా పాలకేంద్రం వద్ద పాలు పోయించుకునేందుకు వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఆమెను ఢీకొట్టింది. ఘటనలో అక్కమ్మ అక్కడికక్కడే దుర్మరణం చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్య కేసులో నిందితులకు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు బెయిల్ తిరస్కరించారు. 2026 జూన్ 28న కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం గ్రామం వద్ద శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పలను హత్య చేసి మోటార్ సైకిల్కు కట్టి ఉప్పుటేరులో పడేసి హత్య చేసిన ఘటన పాఠకులకు విదితమే. ఈ కేసులో నిందితులు కటికల కల్యాణ్, అబ్దుల్ఖాదర్ జిలానీలు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరఫున ఎస్సీ, ఎస్టీ కోర్టు పీపీ భోగిరెడ్డి వెంకన్నబాబు వాదనలు వినిపించారు. దీంతో న్యాయమూర్తి వీరికి బెయిల్ను తిరస్కరించారు.


