పటమట(విజయవాడతూర్పు): భార్యపై అనుమానంతోనే తాను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. పెళ్లయినప్పటి నుంచి భార్యపై అనుమానం ఉందని దీనికితోడు మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కసితోనే చంపానని హత్య కేసులో నిందితుడు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పటమట పోలీసులు శుక్రవారం స్టేషన్ ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా బాడింగి మండలం గదిరినేనివలస గ్రామానికి చెందిన దంపతులు మజ్జిశెట్టి, గౌరమ్మ(60) పటమట ఎలక్ట్రిసిటీ కాలనీలోని ముమ్మనేని టవర్స్లో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. మజ్జిశెట్టి.. భార్య గౌరమ్మను తరచూ అనుమానంతో వేధించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తనకు మద్యం కోసం డబ్బులివ్వాలని అడగ్గా ఇద్దరి మద్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ మద్యం తాగొచ్చిన మజ్జిశెట్టి అపార్టుమెంట్ సెల్లార్లో నిద్రిస్తున్న గౌరమ్మను గ్రానైట్రాయితో తలపై మోది చంపి అక్కడి నుంచి పారిపోయాడు. గురువారం ఉదయం వీఎంసీ పారిశుద్ధ్య ఉద్యోగి గౌరమ్మ రక్తపుమడుగులో ఉండటం గమనించి ఆమె కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు విచారణ చేపట్టామన్నారు. తమ విచారణలో మద్యానికి డబ్బులివ్వలేదని, ఆమైపె తరచూ అనుమానంతో ఇరువురి మద్య ఘర్షణలు చోటు చేసుకునేవని ఈ నేపథ్యంలోనే గౌరమ్మను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాల సాయంతో అదుపులోకి..
హత్య అనంతరం మజ్జిశెట్టిని పటమటలోని ఓ ప్రైవేటు బార్వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి సుమారు 100కు పైగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని గంటలోపే పట్టుకున్నామని తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
పోలీసుల విచారణలో
అంగీకరించిన మజ్జిశెట్టి


