ట్రైనీ కలెక్టర్ను నిలదీసిన వ్యాపారులు
చల్లపల్లి: ిసంగిల్ యూజ్డ్ ప్లాస్లిక్ కవర్ల నిషేధంపై పలువురు వ్యాపారులు అభ్యంతరం తెలిపారు. ట్రైనీ కలెక్టర్ బి.నిఖిల బుధవారం చల్లపల్లిలోని పలు షాపులను తనిఖీ చేసేందుకు స్థానిక పంచా యతీ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చారు. షాపులను తనిఖీలు చేస్తున్న క్రమంలో పలువురు వ్యాపారులు ఆమె వద్దకు వచ్చి, కేవలం చల్లపల్లిలోనే సింగిల్ యూజ్డ్ ప్లాస్లిక్ కవర్లను నిషేధించటం సరికాదన్నారు. దీనిని అన్ని ప్రాంతాలకు వర్తింపజేయాలని సూచించారు. కేవలం ఒక వర్గాన్ని మాత్రమే ఇబ్బంది పెట్టేలా తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా దాడులు చేయటం అన్యాయమన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ తనిఖీలు చేస్తున్నట్లు ట్రైనీ కలెక్టర్ నిఖిల స్పష్టంచేశారు. వ్యాపారుల సూచనల మేరకు మూడు వారాల గడువు ఇచ్చిన తరువాతే నిషేధం అమలు చేశామని గుర్తుచేశారు.
టీడీపీ నాయకుల అత్యుత్సాహం
ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని ప్రజలు స్వాగతించారు. ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి చేతి సంచులను వెంట తెచ్చుకోవడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. అయితే వ్యాపారులు ట్రైనీ కలెక్టర్ను నిలదీసిన సమయంలో అప్పటికే సమాచారం అందుకుని రెడీగా ఉన్నట్లుగా పలువురు టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి వ్యాపారులకు మద్దతుగా మాట్లాడటంపై విమర్శలు వచ్చాయి.


