చిలకలపూడి(మచిలీపట్నం): నూతన పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డీకె బాలాజీ అధికారులకు సూచించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై సోమవారం ఎంపీడీవోలు, డీఎల్డీవోలు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి దరఖాస్తుల సమర్పణకు చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్వీకరించాలన్నారు. ప్రభుత్వ, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్లో నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ ధ్రువీకరణ చేపట్టాలన్నారు. దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అనంతరం సాధారణ అర్హత ప్రమాణాలు, ఇప్పటికే ఉన్న పింఛనుదారుల డేటా బేస్ ఆధారంగా ధ్రువీకరణ చేపట్టాలన్నారు. అర్హత ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో భౌతికంగా పరిశీలించి దరఖాస్తుదారుని అర్హత, సమర్పించిన ధ్రువపత్రాలు, ఇతర వివరాలను ధ్రువీకరించాలన్నారు. భౌతిక పరిశీలన అనంతరం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు దరఖాస్తులోని వివరాలు, ధ్రువపత్రాలు, అర్హత ధ్రువీకరణ, పింఛనుదారుల డేటా బేస్, భౌతిక పరిశీలన నివేదిక, ఈ–కేవైసీ వివరాలను పరిశీలించి అర్హత నిర్ణయించాలన్నారు. అర్హులైన దరఖాస్తులను తదుపరి స్థాయి ఆమోదానికి సిఫార్సు చేయాలన్నారు. సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ–కేవైసీ ధ్రువీకరణ చేపట్టాలన్నారు. 17 నుంచి 21 వరకు సాధారణ అర్హత పరిశీలన, 22 నుంచి 24 వరకు భౌతిక, శాఖా పరమైన పరిశీలన, అర్హత నిర్ధారణ చేయాలన్నారు. 25, 26 తేదీల్లో బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రతి దశను ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హతకు గురైన దరఖాస్తుల వివరాలను అందుకుగల కారణాలను దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా చేపట్టాలని కలెక్టర్ సూచించారు.


