6.50 కిలోల వెండి, ఆరు గ్రాముల బంగారం అపహరణ
ముక్త్యాల(జగ్గయ్యపేట): గ్రామంలోని భవానీ ముక్తేశ్వరస్వామి దత్తత ఆలయం చెన్నకేశవస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే ..ముక్తేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెన్నకేశవసామి ఆలయంలో అర్చకులుగా తూమాటి లక్ష్మీనరసింహాచార్యులు రోజు మాదిరిగానే ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో పూజలు చేసిన అనంతరం ఆలయానికి తాళాలు వేసి వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం ఐదుగంటలకు ఆలయానికి రాగా గర్భగుడి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఆలయ అధికారులు, ధర్మకర్తలకు సమాచారమందించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు తోట సూర్యశ్రీనివాస్, రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్వామి వారికి చెందిన 6.50 కేజీల వెండి కవచాలు, ఆదిలక్ష్మీ అమ్మవారికి చెందిన ఆరు గ్రాముల మంగళసూత్రాలు, ఇతర వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి దేవాదాయ శాఖ ఏసీ నారాయణశెట్టి చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని నందిగామ ఏసీపీ శ్రీనివాసరావు పరిశీలించి క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లతో వివరాలు సేకరిస్తున్నారు. దుండగులు నాలుగు రోజులుగా రెక్కీ నిర్వహించి ఆలయ సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి మాస్కులు ధరించి లోపలికి వెళ్లినట్లు తెలుస్తోందని తెలిపారు. ఆలయం ఎదుటనంబర్ ప్లేట్లేని కారు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా సమీపంలోని ముక్త్యాల కోట వద్ద నిరంతరం సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూతవేటు దూరంలో ఉన్న ఆలయంలో చోరీ జరగడంపై భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


