● ప్రమాదానికి కారణమైన బాలుడిపై కేసు
కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన తిపిరెడ్డి చిన్నారెడ్డి(70) గతనెల 25న రోడ్డు ప్రమాదంలో గాయపడి.. అప్పటి నుంచి చికిత్సపొందుతూ శనివారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చిన్నారెడ్డి గత నెల 25న మండలకేంద్రంలోని బస్టాండ్ నుంచి బైక్పై ఇంటికి వస్తుండగా బాలుడు బైక్పై వస్తూ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందారు. చిన్నరెడ్డి కుమారుడు శేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారణమైన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్ పేర్కొన్నారు.
చెరువులో మునిగి..
వెల్గటూర్: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎలుక లస్మయ్య (68) పశువుల కాపరి. రోజూలాగే శుక్రవారం ఉదయం గేదెలు మేపుకుంటూ గ్రామంలోని చిన్న చెరువు వైపు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో భార్య కంగారుపడి స్థానికుల సహాయంతో చెరువు వైపు వెళ్లి వెదికింది. అతడి ఆచూకీ కనిపించలేదు. శనివారం ఉదయం చెరువులో వెతకగా లస్మయ్య మృతదేహం లభించింది. గేదెలను చెరువు నుంచి బయటకు పంపించేందుకు నీటిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడని ఆయన భార్య దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.
ఉమ్రా యాత్రలో ముస్తాబాద్ వాసి మృతి
ముస్తాబాద్(సిరిసిల్ల): మక్కా యాత్రలో ముస్తాబాద్కు చెందిన మొహమ్మద్ గౌసొద్దీన్(62) గుండెపోటుతో మృతిచెందాడు. ఈమేరకు సౌదీఅరెబియాలో ఉన్న ముస్తాబాద్ వాసులు మృతుడి బంధువులకు సమాచారం అందించారు. ముస్తాబాద్కు చెందిన అటో డ్రైవర్ మొహమ్మద్ గౌసొద్దీన్, ఖాతున్బీ దంపతులు ఈనెల 10న సౌదీ అరేబియాలోని మక్కా ఉమ్రా యాత్రకు వెళ్లారు. సౌదీలోని మక్కా యాత్ర అనంతరం అక్కడే ఉన్న కుమారుడు షాదుల్ వద్దకు ఈనెల 17న గౌసోద్దీన్, ఖాతున్బీలు వెళ్లారు. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గౌసోద్దీన్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో భార్య ఖాతున్బీ, కుమారుడు షాదుల్ల రోదనలు మిన్నంటాయి. పవిత్ర ఉమ్రా యాత్రలో గౌసోద్దీన్ తుదిశ్వాస వదిలడాని మైనార్టీ నాయకులు జహంగీర్, అన్వర్లు తెలిపారు. అక్కడే గౌసోద్దీన్ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


