కేటీదొడ్డి: గద్వాల నియోజకవర్గ రైతాంగం చిరకాల స్వప్నమైన నల్ల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకం నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, దీనికి రూ.1,781 కోట్ల నిధులు మంజూరు చేస్తూ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర క్యాబినేట్ సమావేశంలో ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కేటీదొడ్డి మండలంలోని రైతులతో సమావేశం నిర్వహించి ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. గట్టు ఎత్తిపోతల సామర్థ్యం పెంపుతో కేటీదొడ్డి, గట్టు మండలాలతోపాటు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దశాబ్దాల కాలంగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతాంగం తరపున ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, మాజీ ఎంపీపీ విజయ్కుమార్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, మండలాధ్యక్షుడు ఉరుకుందు, సింగిల్ విండో డైరెక్టర్ రఘుకుమార్శెట్టి, యూత్ ప్రెసిడెంట్ మల్లేష్గౌడ్, సర్పంచు నారాయణ తదితరులు పాల్గొన్నారు.


