● పూర్తికాని కాల్వల నిర్మాణాలు
● చేపట్టని లైనింగ్ పనులు
● లీకేజీలతో వృథా
అవుతున్న సాగునీరు
అయిజ: నెట్టెంపాడు లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా జూరాల బ్యాక్వాటర్ నుంచి 21.425 టీఎంసీల నీటిని ఎత్తిపోసి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించారు. ఇందులో ప్రధాన రిజర్వాయర్లు గుడెందొడ్డి, ర్యాలంపాడు ఉండగా.. సంగాల, నాగర్దొడ్డి, తాటికుంట, ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ర్యాలంపాడు 4 టీఎంసీల సామర్థ్యం కాగా లీకేజీల కారణంగా 2 టీఎంసీలకే పరిమితం చేశారు.
పూర్తికాని టెండర్ల ప్రక్రియ..
నెట్టెంపాడు కాల్వల ప్రధాన లైనింగ్ పనులకు 2026 ఫిబ్రవరిలో రూ.373 కోట్ల అంచనాతో అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ కాలేదు. ప్రధాన కాల్వల ఫేజ్–1, 2 కలిపి 164 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూటరీ, సబ్ డిస్ట్రిబ్యూటరీల్లో సుమారు 100 కి.మీ., లైనింగ్ పనులు పూర్తయితే అదనంగా వేల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. లైనింగ్ టెక్నాలజీ నీటిని పొదుపు చేసే సాంకేతికత, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టుల్లో ఇది లేకపోవడంతో నీరు వృథా అవుతోంది. లైనింగ్ పనులు పూర్తయితే ర్యాలంపాడు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్లతోపాటు, చిన్నోనిపల్లి, ముచ్చోనిపల్లి, సంగాల, నాగర్దొడ్డి, తాటికుంట మినీ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీరు ఎక్కువగా ఆయకట్టు పంట భూములకు అందే అవకాశం ఉంటుంది.
లైనింగ్తో ఉపయోగాలు..
లైనింగ్ పనులు చేపట్టకపోతే కాల్వల్లో కలుపు మొక్కలు, సిల్ట్, కోతలు ఎక్కువగా వస్తాయి. ప్రతి సీజన్లో శుభ్రం చేయాల్సి ఉంటుంది. లైనింగ్ లేని కాల్వల్లో నీరు నేలలోకి ఇంకిపోతుంది. కాల్వలకు లైనింగ్ పనులు చేయకపోవడంతో నెట్టెంపాడు ప్రాజెక్ట్కు సంబంధించిన నీరు ప్రతి సంవత్సరం 2 టీఎంసీలకు పైగా వృథా అవుతుందని అధికారుల అంచనా. ప్రధాన కాల్వలతోపాటు చిన్న కాల్వలకు కూడా లైనింగ్ పనులు పూర్తిచేస్తే నీటి వృథా తగ్గుతుంది. అదేవిధంగా నీటి ప్రవాహ వేగం పెరుగుతుంది. మట్టి కాల్వల్లో ఘర్షణ ఎక్కువగా ఉండి ప్రవాహం నెమ్మదిగా ఉంటుంది. లైనింగ్తో ఉపరితలం మృదువుగా మారి నీరు వేగంగా ప్రవహిస్తుంది. అదే సమయంలో ఎక్కువ నీరు తక్కువ సమయంలో పంట పొలాలకు చేరుతుంది. నీటి వృథా తగ్గడం వలన అదనపు భూమికి సాగునీరు అందుతుంది. పంట పొలాలకు నాణ్యమైన నీరు లభిస్తుంది. లైనింగ్ పనులకు మొదట ఖర్చు ఎక్కువైనా సరే భవిష్యత్లో నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. రైతులకు స్థిరమైన సాగునీరు అందడం వల్లన పంట దిగుబడి పెరిగి.. రైతు లాభపడతారు.
ర్యాలంపాడు
4
ముచ్చోనిపల్లి 1.634
నాగర్దొడ్డి 0.69
చిన్నోనిపల్లి 1.5
తాటికుంట 0.7


