జనగామ: రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో ఈఏడాది (2026–27) నుంచి అమలు చేస్తున్న ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీ కోసం శనివారం కలెక్టరేట్ సమావేశం హాలులో పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వం 39 ప్రీప్రైమరీ స్కూల్స్ మంజూరీ చేయగా, రాతపరీక్ష ద్వారా అర్హులైన టీచర్లు, ఆయాలను ఎంపిక చేయనున్నారు. ఇన్స్ట్రక్టర్ పోస్టులకు హ్యాబిటేషన్ (స్థానిక) పరిధిలోని అభ్యర్థుల నుంచి మొత్తం 269 దరఖాస్తులు అందగా, వారిలో 254 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైర్హారయ్యారు. ఆయా పోస్టులకు 152 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 139 మంది హాజరుకాగా 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, జీసీడీఓ గౌసియాబేగం, ఏసీజీఈ, డీసీఈబీ సెక్రటరీ, కేజీబీవీల అకౌంటెంట్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారు.
ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి
జనగామ రూరల్: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులతో వర్షాభావ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యవసాయ ప్రణాళికలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బెన్షాలోమ్తో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. శాఖల వారీగా అధికారులు సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు.
రాజీపడితేనే కేసుల పరిష్కారం
● సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి
జనగామ రూరల్: కక్షిదారులు రాజీ పడితేనే కేసులు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి శంకర్ శ్రీదేవి అన్నారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ ఆదేశాల మేరకు ప్రత్యేక ఎన్ఐ యాక్ట్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ జడ్జి మాట్లాడుతూ చెక్ బౌనన్స్ కేసులో కోర్టు నుంచి శిక్ష పడకుండా ఉండాలంటే ఇరు పక్షాల వారు రాజీ పడుతూ కేసులను పరిష్కరించుకోవాలన్నారు. స్పెషల్ లోక్ అదాలత్లో చెక్బౌన్స్లో 5 పరిష్కరించగా దీనికి గాను రూ.27.25లక్షలు వసూలు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె సందీప, బండ దయాకర్ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.
కోర్టు నిర్మాణ పనుల పరిశీలన
పట్టణంలోని చంపక్హిల్స్లో ఏర్పాటు చేయనున్న కోర్టు నిర్మాణ పనులను సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి శంకర్ శనివారం పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.


