జనగామ: ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో రైతులు ఆందోళన చెందకుండా శాసీ్త్రయ పద్ధతులతో సాగు కొనసాగించేలా జిల్లా యంత్రాంగం సమగ్ర సమాచార ప్రసార కార్యాచరణ (మూడు దశల) ప్రణాళికను విడుదల చేసింది. కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ప్రణాళికలో వర్షపాతం లోటు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువులు, విత్తనాల లభ్యత, క్షేత్రస్థాయి ప్రచారంపై కలెక్టర్ సందీప్కుమార్ ఝా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
వర్షాభావ లోటును ఎదుర్కొనేలా..
జూలై 8 నాటికి జిల్లాలో సాధారణంగా 177.45 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 141.92 మిల్లీ మీటర్లు మాత్రమే కురవడంతో 20 శాతం లోటు నమోదైంది. 12 మండలాల్లో ఏడు మండలాలు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొనే విధంగా ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా రఘునాథపల్లి, లింగాలఘణపురం, పాలకుర్తి, బచ్చన్నపేట, చిల్పూరు మండలాల్లో వర్షపాతం లోటు అధికంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 2.27 లక్షల ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది 1.55 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. వరి సాగు కొంత వెనుకబడినా పత్తి సాగు సంతృప్తికరంగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
జూలై 15, 30, ఆగస్టు 15 తేదీలు..
వర్షాలు మరింత ఆలస్యమైతే గ్రామాల వారీగా మూడు దశల్లో ప్రత్యామ్నాయ సాగు ప్రణాళిక అమలు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను లక్ష్యంగా పెట్టుకుని కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించనున్నారు. అవసరమైన విత్తనాలు రైతు భరోసా కేంద్రాలు, మహిళా శక్తి రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉంచారు.
ఎరువులు అదనపు నిల్వలు
జిల్లాలో ఎరువుల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. 329 ఎరువుల విక్రయ కేంద్రాల్లో అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉండగా, మార్క్ఫెడ్ ద్వారా అదనపు నిల్వలు సిద్ధంగా ఉంచారు. జిల్లా స్థాయిలో 2,700 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ నిల్వ ఏర్పాటు చేయడంతో పాటు యూరియా బుకింగ్ యాప్లో సుమారు 45,900 సంచులు బుకింగ్కు సిద్ధంగా ఉంచినట్లు స్పష్టం చేశారు.
ఊరూరా ప్రచారం
రైతువేదికలు, గ్రామ సభలు, రైతు భరోసా కేంద్రాలు, వాట్సాప్ గ్రూపులు, ఎస్ఎంఎస్, స్థానిక టీవీలు, పత్రికలు, ఎఫ్ఎం రేడియో, సోషల్ మీడియా వంటి వేదికల ద్వారా విస్త్రృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఎరువులు, విత్తనాల కల్తీపై జిల్లా వ్యవసాయ కంట్రోల్ రూమ్ 8977745512కు రైతులు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
వర్షపాతం మి.మీ.
జిల్లాలో వర్షపాతం వివరాలు
జిల్లాలో సాగు వివరాలు
177.45 మి.మీ.
141.92 మి.మీ.
2.27
లక్షల ఎకరాలు
1.55
లక్షల ఎకరాలు
20
శాతం
సాగు విస్తీర్ణం తగ్గుదల
గతేడాది సాగు
(ఇప్పటి వరకు)
నమోదైన వర్షపాతం
ఈ ఏడాది సాగు
(ఇప్పటి వరకు)
వాన తక్కువైనా..
వ్యవసాయానికి భరోసా
కరువు కాదు.. అప్రమత్తత అవసరం
వర్షపాత లోటు ఎదుర్కొనేందుకు
జిల్లా యంత్రాంగం సిద్ధం
కలెక్టర్ ఆదేశాలు.. ఊరూరా ప్రచారం


