
యూకే ప్రధాని కియిర్ స్టార్మర్ ప్రకటన
అమెరికా నుంచి ఎఫ్–35ఏ ఫైటర్ జెట్లు కొననున్నట్లు వెల్లడి
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు.
కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.
స్వాగతించిన నాటో..
ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.
బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..
ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.