మాస్కో: బ్రిటన్పై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉక్రెయిన్లో శాంతి స్థాపన జరగకుండా బ్రిటన్ అడ్డుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకై ఈ రోజు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్లోనే SCALP సుదూర క్షిపణులను తయారు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని బ్రిటన్ కీవ్కు అందిస్తున్నందుకు రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణులను తయారు చేసే ప్లాంట్లను గుర్తించి ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
ఉక్రెయిన్కు సైనికంగా కొనసాగుతున్న బ్రిటన్ మద్దతును మరింత బలపరుస్తామని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ కీవ్ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా ఈ హెచ్చరికలు చేసింది.
SCALP క్షిపణులకు సంబంధించిన బ్లూప్రింట్లు, సాంకేతిక సమాచారంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ని ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. “ బ్రిటన్ క్రమపద్ధతిలో, నిరంతరం మంటలకు నూనె పోస్తోంది. శాంతి ప్రక్రియలో కనీస స్థాయిలోనైనా పురోగతి సాధించకుండా అడ్డుకునేందుకు బ్రిటన్ పదేపదే పథకాలు రచిస్తోంది. ఇలాంటి క్షిపణులు, ఇతర సైనిక పరికరాల తయారీ కేంద్రాలను గుర్తించేందుకు మా సాయుధ దళాలు అవసరమైన గూఢచారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ సదుపాయాలను ధ్వంసం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి” అని విలేకరులతో అన్నారు.
SCALP క్షిపణి
SCALP ఒక సుదూర క్రూయిజ్ క్షిపణి. ఇది సుమారు 250 కిలోమీటర్ల (దాదాపు 150 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ క్షిపణులను ఉక్రెయిన్కు అందిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్లోనే వీటిని దేశీయంగా తయారు చేయలేదు.
ఉక్రెయిన్లో SCALP క్షిపణుల ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఫ్రాంకో-బ్రిటిష్ క్షిపణిలో ఉపయోగించే బ్రిటన్కు చెందిన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ రంగ సంస్థ MBDA ఉక్రెయిన్కు విడుదల చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించనుంది.
బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటన
కాగాా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్హామ్ సోమవారం కీవ్ను సందర్శించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రష్యా నుంచి వస్తున్న దారుణమైన బెదిరింపులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ రక్షణకు బ్రిటన్ తన సైనిక మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
నా దేశానికి రష్యా దారుణమైన బెదిరింపులు చేస్తున్నప్పటికీ , ఉక్రెయిన్ రక్షణకు మా మద్దతును కొనసాగిస్తాం అని కీవ్లో జరిగిన ప్రసంగంలో బర్న్హామ్ అన్నారు. కాగా ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.


