మెదడును తినే అమీబా కారణంగా ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. అమెరికాలోని లూసియానాలో ఓ సరస్సులో ఈత కొడుతున్న సమయంలో ఆ బాలికకు అమీబా సోకినట్లు భావిస్తున్నారు. బాలిక పేరు లిలియన్ స్మార్ట్. వేడి, స్వచ్ఛమైన నీటి వనరుల్లో వృద్ధి చెందే నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా ఆమెకు సోకింది.
అనారోగ్యంతో ఆమె చేసిన పోరాటానికి సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు ‘లవ్ ఫర్ లిలియన్’ ఫేస్బుక్ పేజీలో ఆమె మృతిని ధ్రువీకరించారు. “నిన్న రాత్రి లిలియన్ మా చేతుల నుంచి యేసు చేతుల్లోకి వెళ్లింది. ఆమె మెదడుకు జరిగిన గాయాలు చాలా తీవ్రంగా ఉండటంతో ఆమె చిన్న శరీరం కోలుకోలేకపోయింది.
ఆమెను ఇక్కడే ఉంచేందుకు ప్రతి ఒక్కరూ చేయగలిగినదంతా చేశారు. మా హృదయం ద్రవీభవించిపోతోంది. ఇక ఏం చేయాలో నిజంగా తెలియడం లేదు. మా అమ్మాయి లేకుండా అడుగు ఎలా వేయాలి?” అని ఆ బాలిక కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

లిలియన్ పేరు ప్రస్తావించకుండా.. లూసియానా ఆరోగ్య శాఖ ఆగస్టు 19న నేగ్లేరియా ఫౌలెరి సోకిన ఒక కేసును ధ్రువీకరించింది. ఇది ఎక్కువగా క్లైబోర్న్ సరస్సులో సోకి ఉంటుందని తెలిపింది. లూసియానా ఆరోగ్య శాఖ ప్రకారం, నేగ్లేరియా ఫౌలెరి ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్కు కారణమవుతుంది. నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు ఈ వ్యాధి సంభవించవచ్చు. అమీబా అక్కడి నుంచి మెదడుకు చేరుతుంది.
నేగ్లేరియా ఫౌలెరి సోకిన బాధితులకు తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వాంతులు ఏర్పడవచ్చని, ఆ తర్వాత మెడ బిగుసుకుపోవడం, మూర్ఛలు, కోమాకు దారితీయవచ్చని లూసియానా ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది అరుదైన వ్యాధి అయినప్పటికీ, ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ ప్రాణాంతకమే.
ఆగస్టు ప్రారంభంలో ఫేస్బుక్లో చేసిన పోస్టులో లిలియన్ తల్లి.. జ్వరం రావడంతో తన చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించామని, ఆ తర్వాత ఆమెకు రెండు కళ్లతో ఒక వస్తువు రెండుగా కనిపించే సమస్య ఏర్పడిందని తెలిపారు. ‘లవ్ ఫర్ లిలియన్’ పేజీ ప్రకారం, తన పుట్టినరోజు జరిగిన మరుసటి రోజే లిలియన్ మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడిన వాపు చాలా తీవ్రంగా ఉందని వైద్యులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో ‘సీజేపీ’ సౌరవ్ దాస్ అడ్రస్.. వారికి సమన్లు


