బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.
దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.
అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.
పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.
ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.
ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు


