దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల విక్రయాలు రెండో త్రైమాసికంలో కొంత మందగించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు, ఏఐ ఆధారిత ఉద్యోగ పునర్వ్యవస్థీకరణ, భౌగోళిక ఉద్రిక్తతలు, రుతుపవనాల ముందు ఉండే కాలానుగుణ ప్రభావాలు కొనుగోలుదారుల సెంటిమెంట్పై ప్రభావం చూపినట్లు ప్రాప్టైగర్ తాజా ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్’ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా టెక్ ఆధారిత బెంగళూరు, పుణె మార్కెట్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 91,729 ఇళ్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 97,674 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు 6.1 శాతం తగ్గాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చినా విక్రయాలు 4.4 శాతం క్షీణించాయి. అయితే కొత్త ఇళ్ల ప్రారంభాలు మాత్రం వార్షిక ప్రాతిపదికన 6 శాతం పెరిగి 89,161 యూనిట్లకు చేరాయి. అంటే కొత్త సరఫరా కంటే విక్రయాలు 2,568 యూనిట్లు అధికంగా ఉండటంతో, మార్కెట్లో అమ్ముడుకాని ఇళ్ల నిల్వ గణనీయంగా పెరగలేదని నివేదిక పేర్కొంది.
పుణెలో భారీ పతనం
ఎనిమిది ప్రధాన మార్కెట్లలో పుణెలో ఇళ్ల అమ్మకాలు అత్యధికంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే విక్రయాలు 20.8 శాతం తగ్గి 12,642 యూనిట్లకు చేరాయి. అహ్మదాబాద్లో 20.2 శాతం తగ్గి 7,541 యూనిట్లకు, బెంగళూరులో 9.2 శాతం తగ్గి 14,186 యూనిట్లకు చేరాయి. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), ఢిల్లీ-ఎన్సీఆర్ మార్కెట్లలోనూ అమ్మకాలు సుమారు 7 శాతం చొప్పున తగ్గాయి.
టెక్నాలజీ రంగంపై ఆధారపడిన నగరాల్లో ఉద్యోగ భద్రతపై నెలకొన్న అనిశ్చితి, ముఖ్యంగా రూ.1 కోటి లోపు ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారిని మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసిందని ప్రాప్టైగర్ అంచనా వేసింది. అయితే టెక్ రంగంలోని పరిణామాలే అమ్మకాలు తగ్గడానికి ఏకైక కారణం కాదని, అంతర్జాతీయ అనిశ్చితి, సీజనల్ ప్రభావాలు కూడా డిమాండ్పై ప్రభావం చూపాయని నివేదిక స్పష్టం చేస్తోంది.
హైదరాబాద్, చెన్నైలో భిన్నమైన పరిస్థితి
ఇతర ప్రధాన నగరాలకు భిన్నంగా హైదరాబాద్, చెన్నై మార్కెట్లు మంచి వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు 14.6 శాతం పెరిగి 13,196 యూనిట్లకు చేరాయి. చెన్నైలో ఏకంగా 36 శాతం పెరిగి 7,183 యూనిట్లకు చేరడం ఎనిమిది నగరాల్లో అత్యధిక వార్షిక వృద్ధిగా నిలిచింది. కోల్కతాలోనూ తొలి త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు 22 శాతం పెరిగి బలమైన రికవరీని చూపించాయి. అయితే వార్షిక ప్రాతిపదికన అక్కడ విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.
అమ్మకాలు తగ్గినా.. ధరలు మాత్రం పైకే
ఇళ్ల విక్రయాల సంఖ్య తగ్గినప్పటికీ ధరల విషయంలో మాత్రం మార్కెట్ బలంగానే ఉంది. ఎనిమిది నగరాల్లో విక్రయాల ఆధారిత సగటు నివాస ధర త్రైమాసిక ప్రాతిపదికన 1 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.10,153కి చేరింది. వరుసగా రెండో త్రైమాసికంలోనూ ఈ ధర రూ.10,000 మార్క్ పైనే కొనసాగింది. ఇది తక్కువ సంఖ్యలో ఇళ్లు అమ్ముడవుతున్నప్పటికీ అధిక విలువ కలిగిన ఇళ్లకు డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది.
బెంగళూరులో ధరలు వార్షికంగా 26 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.9,931కు చేరాయి. ముంబైలో చదరపు అడుగుకు సగటు ధర రూ.15,422గా ఉండగా, వార్షికంగా 20.4 శాతం పెరిగింది. పుణెలో ధర తొలిసారిగా రూ.8,000 మార్క్ను దాటి రూ.8,084కు చేరింది. అహ్మదాబాద్ మాత్రం ఎనిమిది ప్రధాన మార్కెట్లలో అత్యంత అందుబాటు ధరలున్న నగరంగా నిలిచింది. అక్కడ సగటు ధర చదరపు అడుగుకు రూ.5,295గా ఉంది.
పండుగ సీజన్పై ఆశలు
ముందు రోజుల్లో పండుగ సీజన్ గృహ డిమాండ్కు కీలక పరీక్షగా నిలవనుంది. పండుగల సందర్భంగా కొనుగోళ్లు ఊపందుకోవడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్థిరమైన గృహ రుణ పరిస్థితులు మార్కెట్కు మద్దతు ఇవ్వవచ్చని ప్రాప్టైగర్ అంచనా వేస్తోంది. బెంగళూరులో మెట్రో ఫేజ్-3, పుణెలో లైన్-3 విస్తరణ, చెన్నై మెట్రో ఫేజ్-2 వంటి ప్రాజెక్టులు కూడా ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్కు ఊతమివ్వగలవు.
అయితే స్థోమత (affordability) ప్రధాన సవాలుగా మారే అవకాశం ఉంది. నగరాలను బట్టి ధరలు 4.4 శాతం నుంచి 26 శాతం వరకు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి కొనుగోలుదారులపై గృహ రుణ భారం పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ పూర్తిగా బలహీనపడలేదని, కానీ కొనుగోలుదారులు గతంతో పోలిస్తే మరింత ఎంపిక చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నారని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి: ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు


