ప్రఖ్యాత కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. వార్షిక ప్యాకేజీ రూ.35 లక్షలు.. మౌలిక వసతులు.. ఇవన్నీ చూసి ఆ ఉద్యోగి కెరీర్ అత్యున్నత దశలో ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే! అధిక వేతనాలు అందుతున్నప్పటికీ కార్పొరేట్ రంగంలో విపరీతంగా పెరుగుతున్న టాక్సిక్ వర్క్ కల్చర్ (విషతుల్యమైన పని వాతావరణం) ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా పాతాళానికి నెట్టివేస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఒక టెక్కీ వేదన ఈ చేదు నిజాలను మరోసారి హైలైట్ చేసింది.
టెక్కీ పంచుకున్న వివరాలు..
‘సుదీర్ఘ పని గంటలు, శని-ఆదివారాలు కూడా పనిచేయడంపై నా మేనేజర్లతో మాట్లాడగా.. రోజుకు 14 గంటలు పనిచేయడమే ఈ కంపెనీ సంస్కృతి.. అని తేల్చి చెప్పారు. నెలల తరబడి కష్టపడి నేను విజయవంతంగా పూర్తి చేసిన ఒక ప్రాజెక్ట్ను ఉన్నతాధికారుల వద్ద మేనేజర్ ప్రదర్శిస్తూ.. నేను 3 నెలల పాటు ఏ పనీ చేయలేదని, అతనే ప్రతిదీ సరిచేశాడని అబద్ధాలు చెప్పారు. అంతేకాకుండా, నేను రూపొందించిన మోడల్ వల్ల కంపెనీకి 10కి పైగా కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. కానీ ఆ శ్రమనంతటినీ వారి ఖాతాలో వేసుకున్నారు’ అని చెప్పాడు.
‘తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మూడు రోజులు చికిత్స పొందుతున్న సమయంలోనూ విశ్రాంతి ఇవ్వలేదు. కేటీ (Knowledge Transfer) ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో అంటూ 10 సార్లు ఫోన్ చేసి వేధించారు. వన్-ఆన్-వన్ సమావేశాల్లో ప్రోత్సహించాల్సింది పోయి, 'నువ్వు కేవలం ఫిర్యాదులు చేస్తావు.. ఏ పనీ చేయవు' అని నిందించారు. నన్ను తప్పుగా చిత్రీకరిస్తూ బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని వెల్లడించారు.
ప్యాకేజీలు భారీగానే ఉన్నాయి.. ఆరోగ్యం ఏది?
సాధారణంగా భారీ జీతాలు లభించే ఉద్యోగాల్లో అన్ని సదుపాయాలు ఉంటాయని భావిస్తారు. కానీ, నిరంతర ఒత్తిడి, అపరిమితమైన పని గంటలు, సెలవు రోజుల్లో కూడా పనులు చేయడం, అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి రావడం వంటి అంశాలు ఉద్యోగులను మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు పండుగల వేళల్లో కూడా విశ్రాంతి లేకపోవడం, హెచ్ఆర్ విభాగాల కఠిన వైఖరి ఉద్యోగుల్లో భయాందోళనలు, తీవ్రమైన మానసిక అలసట, ఆందోళనకు దారితీస్తున్నాయి.
లేఆఫ్ల భయం.. అనిశ్చితిలో భవిష్యత్తు
అధిక వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులకు మరో వైపు లేఆఫ్ భయం ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక 10-15 నిమిషాల హెచ్ఆర్ సంభాషణతో ఏళ్ల శ్రమ తుడిచిపెట్టుకుపోతోందని, ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ కంపెనీ బడ్జెట్ గణాంకాల ముందు ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ జీతాలు మానసిక ప్రశాంతతకు ప్రత్యామ్నాయం కాజాలవు. ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ అత్యవసర నిధులు, ప్రత్యామ్నాయ రంగాలు, బలమైన నెట్వర్కింగ్ను పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: టీసీఎస్ ఉద్యోగుల ల్యాప్టాప్ల్లో కొత్త టూల్


