అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుబడుల పోర్ట్ఫోలియోలో జూన్ నెలలో భారీ కదలికలు చోటుచేసుకున్నాయి. ఆయనకు సంబంధించిన పెట్టుబడి ఖాతాల నుంచి ఏకంగా 1,051 సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగినట్లు తాజా ఆర్థిక వెల్లడి నివేదికలో వెల్లడైంది. ఈ లావాదేవీల మొత్తం విలువ కనీసం 78.1 మిలియన్ డాలర్ల నుంచి గరిష్ఠంగా 263.1 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ నైతిక వ్యవహారాల కార్యాలయం (OGE) వెల్లడించిన పత్రాలు చెబుతున్నాయి. అయితే ఒక్కో లావాదేవీకి ఖచ్చితమైన మొత్తం కాకుండా నిర్దిష్ట విలువల పరిధినే ఫైలింగ్లో పేర్కొన్నారు.
జూన్లో ట్రంప్ పోర్ట్ఫోలియోలోకి ప్రముఖ కంపెనీల షేర్లు భారీగా వచ్చాయి. ముఖ్యంగా బెర్క్షైర్ హాత్వే, వీసా, మాస్టర్కార్డ్, సింటాస్ షేర్లలో ఒక్కో కంపెనీకి 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల పరిధిలో కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడైంది. అదే సమయంలో మెటా ప్లాట్ఫామ్స్, మోటరోలా సొల్యూషన్స్లోనూ 1 మిలియన్ డాలర్ల నుంచి 5 మిలియన్ డాలర్ల రేంజ్లో షేర్లను విక్రయించారు.
భారీ విక్రయం.. వాన్గార్డ్ ఈటీఎఫ్
జూన్ 22న జరిగిన లావాదేవీల్లో అత్యంత పెద్దది వాన్గార్డ్ గ్రూప్కు చెందిన డివిడెండ్ అప్రిషియేషన్ ఇండెక్స్ ఫండ్ ఈటీఎఫ్ షేర్ల విక్రయం. దీని విలువ 5 మిలియన్ డాలర్ల నుంచి 25 మిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు ఫైలింగ్ పేర్కొంది. అదే రోజున ఫిడెలిటీ నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (FIS), హోమ్ డిపో షేర్లను కూడా కొనుగోలు చేసినట్లు వివరాలు వెల్లడయ్యాయి.
పలాంటీర్లోనూ కొనుగోళ్లు, అమ్మకాలు
సాఫ్ట్వేర్ సంస్థ పలాంటీర్ షేర్ల విషయంలోనూ ట్రంప్ పెట్టుబడి ఖాతాలు పలుమార్లు లావాదేవీలు జరిపాయి. జూన్ 3న 1,001–15,000 డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, జూన్ 16న 15,001–50,000 డాలర్లు, జూన్ 18న 500,000–1 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. అనంతరం జూన్ 23, 24 తేదీల్లో మళ్లీ పలాంటీర్లో కొనుగోళ్లు జరిగాయి.
2025లోనూ 21 వేలకు పైగా ట్రేడ్స్
ట్రంప్ పెట్టుబడులపై ఇలాంటి చురుకుదనం కొత్తది కాదు. 2025లో ఆయనకు సంబంధించిన ఖాతాల నుంచి 21,000కు పైగా సెక్యూరిటీస్ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ 600 మిలియన్ నుంచి 1.86 బిలియన్ డాలర్ల మధ్య ఉన్నట్లు గతంలో వెల్లడైన ఫైలింగ్ తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఒకే రోజున ఒకే సెక్యూరిటీని కొనుగోలు చేయడంతోపాటు విక్రయించిన లావాదేవీలు కూడా నమోదయ్యాయి.
స్వతంత్ర నిర్వహణలోనే పెట్టుబడులు
ట్రంప్ పెట్టుబడుల విషయంలో ప్రయోజనాల సంఘర్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ.. వైట్హౌస్ మాత్రం ఆయనకు పెట్టుబడి నిర్ణయాలపై ప్రత్యక్ష నియంత్రణ లేదని చెబుతోంది. ట్రంప్ కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం, ఆస్తులను స్వతంత్ర మేనేజర్లు నిర్వహిస్తున్నారు. కంప్యూటర్ ఆధారిత మోడల్ పోర్ట్ఫోలియోల ద్వారా ప్రముఖ సూచీలను అనుసరించే విధంగా పెట్టుబడులు నిర్వహిస్తున్నారని వైట్హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగ్లే తెలిపారు. ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ కూడా ఆస్తులు బ్లైండ్ ట్రస్ట్ పరిధిలో ఉన్నాయని గతంలో పేర్కొన్నారు.
అయితే పెట్టుబడుల సమయం, భారీ లావాదేవీల సంఖ్య కారణంగా నైతికతపై చర్చ కొనసాగుతోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ట్రంప్ పెట్టుబడి ఖాతాలు వేల సంఖ్యలో కొనుగోళ్లు, అమ్మకాలు జరిపినట్లు గతంలో వెల్లడైంది.
ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన


