ప్రస్తుతం ఆసియాలోకెల్లా భారత్ స్టాక్ మార్కెట్కు అత్యల్ప ప్రాధాన్యమిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవోఎఫ్ఏ) చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ నెల 7–13 మధ్య ఆసియా ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో ఈ అంశం వెల్లడైనట్లు నివేదికలో బీవోఎఫ్ఏ సర్వేలో తెలియజేసింది. దీంతో ఇండొనేసియా స్థానంలో భారత్ను చేర్చినట్లు వెల్లడించింది. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లలో పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొంది. 272 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తులను నిర్వహిస్తున్న 98 ఫండ్ మేనేజర్లతో నిర్వహించిన సర్వేలో బీవోఏ మరిన్ని అంశాలను పేర్కొంది. వివరాలు ఇలా..
27 శాతానికి డౌన్
భారత్తో పోలిస్తే ఇన్వెస్టర్ల సెంటిమెంటు ఇండొనేసియావైపు మొగ్గు చూపుతోంది. జూలైలో 32 శాతంగా నమోదైన నెట్ అండర్వెయిట్(పెట్టుబడుల ప్రాధాన్యం) ఆగస్ట్ రెండోవారానికల్లా 27 శాతానికి క్షీణించింది. ఇదే సమయంలో ఇండొనేసియాకు ప్రాధాన్యం పెరిగింది. ఆసియా ప్రాంతంలో తైవాన్, జపాన్ మార్కెట్లకు ఇన్వెస్టర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి భారత్ చైనా, ఫిలిప్పీన్స్కంటే వెనుకబడినట్లు సర్వే పేర్కొంది.
ఏఐలో వెనుకబాటు
ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో పటిష్టస్థాయిలో ఎక్స్పోజర్ లేకపోవడానికితోడు.. బలహీన ఆర్థిక వృద్ధి దేశీ ఈక్విటీలపట్ల సమస్యాత్మకంగా భావిస్తున్నట్లు బీవోఎఫ్ఏ సర్వే పేర్కొంది. సంస్కరణలలేమి, షేర్ల అధిక ధరలు, రూపాయి బలహీనత సైతం ప్రతికూలంగా పరిణమించినట్లు వివరించింది. గత రెండు వారాలుగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలాపడిన సందర్భంలో సర్వే వివరాలు వెలువడటం గమనార్హం! అయితే ఇటీవల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టుబడులు చేపడుతుండటం, కంపెనీల ఆర్జన అంచనాలు మెరుగుపడటం, మార్కెట్ అంతర్గత మూలాలు మెరుగుపడుతుండటం తదితర సానుకూలతలను ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా స్పందించినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి.
తొలి 6 నెలలు డీలా..
ఈ క్యాలండర్ ఏడాది(2026) తొలి ఆరు నెలలు విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే అత్యధిక ప్రాధాన్యమిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50లో భాగమైన కంపెనీల సగటు ఆర్జన వార్షికంగా 18 శాతం పుంజుకోగా.. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనాలు 10 శాతాన్ని మించడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం మే నెలలోనూ బీవోఎఫ్ఏ సర్వేలో ఇండియా అత్యల్ప ప్రాధాన్యతగల మార్కెట్గా నిలిచింది. ఇందుకు యూఎస్ ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం ప్రభావం చూపింది. దీంతో ఇంధన వ్యయాల భారంతో ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరిగినట్లు సర్వే అభిప్రాయపడింది.
దీనికితోడు రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదాలకు సమీప భవిష్యత్లో పరిష్కారం కనిపించకపోవడం, పెరుగుతున్న చమురు ధరలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 8 శాతం రికవరీ అయినప్పటికీ ఈ ఏడాది దేశీ స్టాక్ మార్కెట్లు నికరంగా 8 శాతం క్షీణించాయి. దీంతో ఆసియాలో బలహీనపడిన ప్రధాన మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలిచినట్లు సర్వే తెలియజేసింది. ఇదే కాలంలో ఇండొనేసియా మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ జూన్ కనిష్టం నుంచి 20 శాతం పుంజుకున్నట్లు పేర్కొంది. ఇందుకు ఆ దేశ కరెన్సీ నిలకడకు కేంద్ర బ్యాంకు తీసుకున్న చర్యలు కొంతమేర దోహదపడినట్లు ప్రస్తావించింది.
ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’!


