సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్లాట్ఫారమ్లు పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. లాభార్జనే ధ్యేయంగా యూజర్లను అడిక్ట్ చేసే ఆల్గారిథమ్లు, ఇన్ఫినిట్ స్క్రోలింగ్, పుష్ నోటిఫికేషన్లను మెటా ఉద్దేశపూర్వకంగా రూపొందించిందని, చిన్నారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందనేవి ప్రధాన ఆరోపణలు.
అమెరికాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు టెక్ ప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ విచారణ ముగింపు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిగ్టెక్ కంపెనీల నియంత్రణకు దిశానిర్దేశం చేయనుంది.
ప్రపంచంపై ప్రభావం
అమెరికా కోర్టు మెటాపై కఠిన పరిమితులు విధిస్తే యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలు కూడా తమ వద్ద ఉన్న డిజిటల్ భద్రతా చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు ఇది బలమైన నమూనాగా మారుతుంది.
ఇన్ఫినిట్ స్క్రోలింగ్ తొలగింపు, వయసు గుర్తింపు నిబంధనలు, ఆటోమేటిక్ టైమ్ లిమిట్స్ వంటి ప్రతిపాదనలను మెటా అమలు చేయాల్సి వస్తే ఆ మార్పులు గ్లోబల్ కోడింగ్లో భాగంగా ఇతర దేశాల యూజర్లకూ వర్తిస్తాయి.
అత్యధిక సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారత్లో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ)’ అమలులోకి వస్తున్న తరుణంలో పిల్లల డేటా రక్షణపై ఈ తీర్పు కీలక సూచికగా నిలుస్తుంది.
ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కూడా సాక్ష్యమివ్వనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సురక్షితమైన డిజిటల్ సమాజం వైపు ప్రపంచం వేస్తున్న అడుగుల్లో ఈ చట్టపరమైన పోరాటం ఒక కీలక మైలురాయి కానుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: అనలాగ్ పన్నీర్పై నిషేధం


