భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. శనివారం జరిగిన ది ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్లో మాట్లాడిన ఆయన.. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన అంశాలపై ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయని చెప్పారు.
ప్రస్తుతం మిగిలింది ప్రధానంగా ఒప్పందంలోని చట్టపరమైన, సాంకేతిక పదజాలాన్ని తుది రూపంలోకి తీసుకురావడమే అని వివరించారు. అందుకే ఒప్పందం ఖరారు కావడానికి కొంత సమయం పడుతోందని ఆయన పేర్కొన్నారు.
రష్యా చమురుపై అమెరికా వైఖరి
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే ప్రతిపాదన అమెరికా కాంగ్రెస్లో వస్తున్న నేపథ్యంలో.. గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లు కలిసి మద్దతు ఇస్తున్నప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం స్వయంగా ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఇలాంటి చట్టం అమల్లోకి వస్తే భారత్పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అంగీకరించారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపైనే అధ్యక్షుడు ట్రంప్ ప్రధానంగా దృష్టి పెట్టారని గోర్ చెప్పారు.
మోదీ-ట్రంప్ మధ్య సంబంధాలు
అమెరికా రాయబారి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రశంసలు కురిపించారు. ఇద్దరు నేతలు ఫలితాలపై దృష్టి పెట్టే వ్యక్తులని, త్వరగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలని కోరుకుంటారని అన్నారు.
ముఖ్యంగా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత ట్రంప్ అధికారంలో లేని సమయంలో కూడా మోదీ ఆయనకు మద్దతుగా నిలిచారని, ఆ సమయంలో మోదీ చూపిన స్నేహాన్ని ట్రంప్ గుర్తుంచుకున్నారని గోర్ పేర్కొన్నారు. ఈ పరస్పర నమ్మకం ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్కు అమెరికా ప్రాధాన్యం
ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో భారత్కు అమెరికా ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని గోర్ అన్నారు. అందుకే.. అమెరికా ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయి అధికారులు భారత్ను సందర్శిస్తున్నారని తెలిపారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మేలో ఐదు రోజుల పాటు భారత్లో పర్యటించారని, అక్టోబర్లో మరోసారి పలు రోజుల పర్యటనకు రానున్నారని గోర్ చెప్పారు. ఇంత స్థాయిలో ఒక దేశ అధికారి తరచుగా భారత్ను సందర్శించడం అసాధారణమని ఆయన వ్యాఖ్యానించారు.


