సమస్యల పరిష్కారానికి  ‘నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్‌’  | Rajnath Singh pushes for border demarcation with China | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి  ‘నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్‌’ 

Jun 28 2025 5:47 AM | Updated on Jun 28 2025 5:47 AM

Rajnath Singh pushes for border demarcation with China

భారత్, చైనా మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం కావాలి 

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆకాంక్ష

చైనా రక్షణ శాఖ మంత్రి జున్‌తో భేటీ  

ఖింగ్‌డావో/న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య నెలకొన్ని సంక్లిష్టమైన సమస్యలను నిర్మాణాత్మక రోడ్‌మ్యాప్‌ ద్వారా పరిష్కరించుకుందామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రతిపాదించారు. ఆయన చైనా రక్షణ శాఖ మంత్రి డాంగ్‌ జున్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవడం, వివాదాలకు తావులేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించడానికి ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పునరుత్తేజితం చేయడం వంటి చర్యలతో స్నేహ సంబంధాలు బలోపేతం చేసుకుందామని చెప్పారు. 

చైనాలో ఖింగ్‌డావో నగరంలో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా గురువారం రాజ్‌నాథ్‌ సింగ్, డాంగ్‌ జున్‌ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రధానంగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద శాంతియుత పరిస్థితులను కొనసాగించడంపై చర్చించారు. పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్, చైనా కలిసి పనిచేయాలని, ‘చక్కటి పొరుగుదేశం’గా ఇరుదేశాలు సహకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. 

2020లో తూర్పు లద్ధాఖ్‌లో జరిగిన ఘర్షణ తర్వాత నెలకొన్న అపనమ్మకాన్ని తొలగించుకోవడానికి క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. చైనాతో తాము ఎలాంటి ఘర్షణ కోరుకోవడం లేదన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలన్నదే తమ ఆకాంక్ష అని వివరించారు. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి రాజ్‌నాథ్‌ చైనా రక్షణ మంత్రికి వివరించారు. సరిహద్దుల్లో సైన్యాన్ని, ఉద్రిక్తతలు తగ్గించుకోవడమే లక్ష్యంగా వేర్వేరు స్థాయిల్లో సంప్రదింపులు కొనసాగించాలని రాజ్‌నాథ్, డాంగ్‌ జున్‌ నిర్ణయించుకున్నారు.   డాంగ్‌ జున్‌కు రాజ్‌నాథ్‌ ‘ట్రీ ఆఫ్‌ లైఫ్‌’ అనే మధుబని పెయింటింగ్‌ను బహూకరించారు.

‘సుఖోయ్‌’ ఆధునీకరణ  
ఖింగ్‌డావో సిటీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ర ష్యా రక్షణ శాఖ మంత్రి ఆండ్రీ బెలో సోవ్‌తో భేటీ అయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇండో–రష్యా రక్షణ సంబంధాలు, పరస్పర సహకారంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సుఖోయ్‌–30ఎంకేఐ యుద్ధ విమానాల ఆధునీకరణపై చర్చించారు. గగనతలానికి ప్రయోగించే క్షిపణుల తయారీ, ఎస్‌–400 మిస్సైల్‌ వ్యవస్థ రెండో బ్యాచ్‌ పంపిణీపై చర్చలు జరిపారు. భారత వైమానిక దళం వద్ద రష్యా అందజేసిన 260 సుఖోయ్‌–30ఎంకేఐ ఫైటర్‌ జెట్లు ఉన్నాయి. వీటిని రష్యా సహకారంతో అప్‌గ్రేడ్‌ చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఇదే అంశాన్ని రష్యా రక్షణ మంత్రి వద్ద రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement