
న్యూఢిల్లీ: ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మిడిల్ ఈస్ట్లో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించిన భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి వెళ్లిపోవాలనుకునే భారతీయ పౌరులను భారత్ అక్కడి నుంచి స్వదేశానికి తీసుకువస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి ముందుగా భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యాలు కల్పించనున్నామని ఎంఈఏ తెలిపింది. విదేశాలలో ఉన్న భారత పౌరుల భద్రతకు భారత ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొంది.
భారత్ చేరుకోవాలనుకునేవారు టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదించాలని ఎంఈఏ తెలిపింది. ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఇజ్రాయెల్లో నివసిస్తున్నారు. ఇరాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత్ ఇప్పటికే ఆపరేషన్ సింధును ప్రారంభించింది. దీనిలో భాగంగా 800 మందికి పైగా భారతీయులను మూడు చార్టర్ విమానాలలో భారత్ తరలివచ్చారు.
ఇది కూడా చదవండి: అణు కేంద్రాలపై దాడులతో రేడియేషన్ లీక్?