ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చాం
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడి
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని నెలకొల్పాలంటే లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మంగళవారం తేల్చిచెప్పారు. అమెరికాతో కుదిరిన తాత్కాలిక ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చినట్లు వెల్లడించారు. అయితే, ఈ షరతును ఇజ్రాయెల్ ఇప్పటికే తిరస్కరించిందని అన్నారు. ఇజ్రాయెల్ వైఖరిలో మార్పు రాకపోతే తాత్కాలిక ఒప్పందం నిరీ్వర్యమైపోయి, మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కావొచ్చని ఉద్ఘాటించారు.
అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఇంకా బహిర్గతం చేయలేదు. అందులోని అంశాలపై అమెరికా, ఇరాన్ అధికారులు అప్పుడప్పుడు పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ భాగస్వామి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి లెబనాన్లో ఇరాన్ మద్దతు కలిగిన హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్తో ఇజ్రాయెల్ పోరాడుతోంది. లెబనాన్లో విస్తృతమైన ప్రాంతాలను ఇప్పటికే స్వా«దీనం చేసుకుంది.
దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దురాక్రమణ ఇంకా కొనసాగితే.. అది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని అబ్బాస్ అరాగ్చీ స్పష్టంచేశారు. ఈ యుద్ధ సమయంలో ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వెళ్లకపోతే యుద్ధం పూర్తిగా ముగిసినట్లు కాదని పేర్కొన్నారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ ఉపసంహరణ అంశాన్ని ఒప్పందంలో చేర్చలేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం మాట్లాడుతూ.. అవసరమైనంత కాలం తమ సైన్యం లెబనాన్లోనే ఉంటుందని అన్నారు. అయితే ఇరాన్ పట్టుబడుతున్నట్లుగా, లెబనాన్లో ఇజ్రాయెల్ సహా సైనిక కార్యకలాపాలను ముగించాలని ఈ ఒప్పందంలో ఉన్నట్లు తాజాగా పాకిస్తాన్ వెల్లడించింది.


