ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.