ట్రంప్‌-ఇరాన్ డీల్‌.. గల్ఫ్ దేశాల్లో గుబులు! | Irans Recovery Plan Triggers Gulf Concerns | Sakshi
Sakshi News home page

ట్రంప్‌-ఇరాన్ డీల్‌.. గల్ఫ్ దేశాల్లో గుబులు!

Jun 23 2026 6:56 AM | Updated on Jun 23 2026 10:28 AM

Irans Recovery Plan Triggers Gulf Concerns

అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గల్ఫ్ దేశాల గుబులు.. డబ్బు, భద్రత, హర్ముజ్‌పై పెరుగుతున్న ప్రశ్నలు. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెల్లిస్తారు?. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ అంశం ఆ రీజియన్‌ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్‌కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరే అవకాశం ఉంది.

300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ..
అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం ప్రకారం, ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన ప్రణాళికను ప్రాంతీయ భాగస్వాములతో కలిసి రూపొందించాలని అమెరికా అంగీకరించింది. ఈ నిధుల అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.

అయితే ఈ భారీ నిధులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, దాని సైనిక సామర్థ్యాలను కూడా పెంచే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఒప్పందంలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారికి మరింత కలవరపెడుతోంది.

గల్ఫ్ దేశాల భద్రతా ఆందోళనలు
సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక వసతులు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం ఆగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో తెలుసుకోవాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి.

స్తంభింపజేసిన ఆస్తులపై కొత్త ఫార్ములా!
చర్చల్లో మరో కీలక అంశం ఇరాన్‌కు చెందిన విదేశీ ఆస్తులు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ JD Vance వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత విడుదలయ్యే నిధుల వినియోగంపై అమెరికా, ఖతార్ సంయుక్త పర్యవేక్షణ ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది.

అంటే విడుదలైన డబ్బును ఇరాన్ నేరుగా వినియోగించకుండా, అమెరికా గోధుమలు, మొక్కజొన్న వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనను ట్రంప్ అల్లుడు(ఇవాంక భర్త), మాజీ వైట్‌హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ Jared Kushner  ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

వందల బిలియన్ల డాలర్లు పణంగా..
ప్రారంభ చర్చల్లో 6 నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ, వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన 100 నుంచి 120 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

హర్ముజ్ జలసంధిపై దృష్టి
రుబియో పర్యటనలో మరో కీలక అంశం హర్ముజ్‌ జలసంధి Strait of Hormuz. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి ఇటీవల యుద్ధంతో ఉద్రిక్త ప్రాంతంగా మారింది. యుద్ధానికి ముందు రోజుకు 100 నుంచి 131 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు పడిపోయింది. 60 రోజుల చర్చల కాలంలో రవాణాపై అదనపు రుసుములు విధించబోమని ఒప్పందంలో ఉన్నప్పటికీ, ఆ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.

కీలక ప్రశ్న మాత్రం అదే..
ఇరాన్‌తో శాంతి ఒప్పందం, పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగానే ఉన్నా... 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికానా? గల్ఫ్ దేశాలా? లేదంటే అంతర్జాతీయ భాగస్వాములా?** అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఆ బిల్లు చివరికి ఎవరు చెల్లించాలి?.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement